Cabinet: మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన ఈనెల 18వ తేదీన కేబినెట్ (Cabinet) సమావేశం కానుంది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారం (Medaram) లో తెలంగాణ కేబినెట్ను నిర్వహించనున్నారు. మేడారం జాతర ఏర్పాట్లు, రాబోయే బడ్జెట్ సమావేశాలు, ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రంలో నీటి వాటాల అంశంతో పాటు తాజా పరిణామాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. సాధారణంగా సచివాలయంలో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఈ సారి మేడారంలో నిర్వహిచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది.
మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ జాతరకు ముందు మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించేందుకు యోచిస్తున్నట్లుగా సమాచారం. అలాగే జనవరి 18వ తేదీన ఉదయం ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికల (Municipal elections) ప్రచార సభ నిర్వహించి మధ్యాహ్నం మేడారంలో కేబినెట్ భేటీ జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఆ రాత్రి మేడారంలోనే సిఎం రేవంత్ బస చేయనున్నారు. 19వ తేదీన ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాలను ప్రారంభించి ఆయన తొలి దర్శనం చేసుకుంటారు. అనంతరం హైదరాబాద్కు చేరుకుని సాయంత్రం దావోస్కు బయలుదేరుతారు.






