పునాదిపాడులో బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్
పునాదిపాడు: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా కంకిపాడు మండలం పునాదిపాడులో పోలవరపు మాధవరావు, ఇతర కుటుంబ సభ్యుల విరాళం రూ.1.20 కోట్లు వెచ్చించి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు సిబ్బంది, దాత కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల లేబరేటరీలను పరిశీలించారు. విద్యార్థులతో సంభాషించారు. బాగా చదువుకోవాలని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం దాత కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థులను కలిసి అభినందించారు. దాసరి ఆళ్వార స్వామి రచించిన భారతదేశ ప్రధానమంత్రులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, ఇతర ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, కలెక్టర్ డీకే బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.








