బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు.. అందుకే కవితకు బెయిల్: మహేశ్ గౌడ్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ నేత కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ వల్లనే కవితకు బెయిల్ వచ్చిందని బీజేపీ నేత, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా కవితకు బెయిల్ దక్కడంపై పొలిటికల్ కామెంట్స్ చేసింది. కవితకు బెయిల్ వస్తుందన్న విషయం ఊహించిందేనని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, అందుకే కవితకు బెయిల్ వచ్చిందని ఆయన అన్నారు. చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూసి, చివరకు పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని మహేశ్ గౌడ్ ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ దాసోహమైందన్న ఆయన.. కేటీఆర్, హరీశ్లు ఢిల్లీలో బీజేపీ నేతలకు ఆపద మొక్కులు మొక్కారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి, కాళ్ల మీద పడి, చివరకు కవితకు బెయిల్ తెచ్చుకున్నారని విమర్శించారు.