‘గార్డియన్’ ఆఫ్ ద వార్.. ఇరాన్ కు ట్రంప్ AI వార్నింగ్…!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ కు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. తనదైన రీతిలో ఏఐ హెచ్చరికలు పంపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఏఐ జనరేటెడ్ ఫొటోలు పోస్ట్ చేశారు ట్రంప్. ‘‘గార్డియన్స్ ఆఫ్ ద వరల్డ్’’ పేరుతో షేర్ చేసిన తొలి ఫొటోలో ట్రంప్ ప్రపంచాన్ని పరిశీలిస్తున్నట్లుగా కనిపించారు. ముందు భాగంలో అమెరికా యుద్ధవిమానాలు ఎగురుతుండగా, రెండు వైపులా ఇరాన్పై భారీ పేలుళ్లు, మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు ఉన్నాయి. సముద్రంలో అమెరికా యుద్ధనౌకలు మోహరించినట్లు కూడా ఈ ఫొటోలో కనిపిస్తోంది.
‘‘స్ట్రైక్ ఆన్ ఖర్గ్’’ పేరుతో ఉన్న మరో చిత్రంలో ఖర్గ్ ద్వీపంలోని (Kharg Terminal) ప్రధాన చమురు ఎగుమతి టెర్మినల్పై అమెరికా యుద్ధ విమానాలు దాడి చేస్తున్నట్లుగా చూపించారు. చమురు నిల్వ ట్యాంకులు పేలిపోవడం, సముద్రంలో నౌకల మధ్య భారీ అగ్నికీలలు ఎగిసిపడడం వంటి దృశ్యాలతో ఈ ఫొటోను రూపొందించారు. ఇరాన్ చమురు ఎగుమతికి కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు పంపారు.
‘‘It’s Our Oil Tanker Now’’ అనే మరో చిత్రంలో ట్రంప్ అమెరికా జెండా పట్టుకుని ఇరాన్ (Iran) చమురు ట్యాంకర్పై నిలబడి ఉండగా.. పక్కనే అమెరికా సైనికులు ఆయుధాలతో ఉంటారు. కొందరు వ్యక్తులు సముద్రంలోకి దూకుతున్నట్లు ఆ ఫొటోలో ఉంది. దీంతో ఇరాన్ ఓడను అమెరికా స్వాధీనం చేసుకుందనే భావన కల్పించే ప్రయత్నం చేశారు.
అలాగే, ట్రంప్ 2028, అమెరికా ఫస్ట్, ప్లాన్ ట్రస్టెడ్ వంటి నినాదాలతో పోస్టర్లను షేర్ చేశారు. ట్రంప్ పంచుకున్న ఈ ఏఐ చిత్రాలు వాస్తవాల కంటే రాజకీయ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఉన్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా పోస్టులతో ఇరాన్పై అమెరికా సైనిక చర్య కొనసాగుతుందని అగ్రరాజ్య అధ్యక్షుడు సంకేతాలిచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








