మిస్టర్ సింగ్…దేశం విడిచిపోవాలంటూ అమెరికా జాత్యహంకార పోస్టర్…!
స్వేచ్ఛా సమానత్వం, హక్కులకు స్వర్గధామం లాంటి అమెరికా క్రమంగా తన సద్గుణాలను వదులుకుంటోందా.. ? వలసదారులపై కఠిన వైఖరిలో భాగంగా తన కున్న ప్రత్యేక లక్షణాలను కోల్పోతోందా..? ఇటీవలి కాలంలో ఆదేశం విడుదల చేస్తున్న కొన్ని పోస్టర్లు, కొన్ని సందేశాలు చూస్తుంటే … ప్రజాస్వామ్య ప్రియులకు అదే అనుమానం రేకెత్తుతోంది. అలాంటిదే లేటెస్టుగా మిస్టర్ సింగ్ పేరుతో ఓ ఏఐ జెనరేటెడ్ పోస్టర్ విడుదలైంది.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) విభాగం విడుదల చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) జనరేటెడ్ పోస్టర్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ‘ట్రాన్స్ఫార్మర్స్’ సినిమా స్టైల్లో రూపొందించిన ఈ పోస్టర్లో ‘మిస్టర్ సింగ్’ అనే పేరును ప్రస్తావిస్తూ, స్వయంగా దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించడంపై సిక్కు, దక్షిణాసియా సమాజాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ ప్రభుత్వ కఠిన వలస విధానాల్లో భాగంగా ఈ ప్రచారం చేపట్టారు.
సెప్టెంబర్ 9న డీహెచ్ఎస్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఈ గ్రాఫిక్ను పోస్ట్ చేసింది. ‘ట్రాన్స్ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ డిపోర్టేషన్స్’ అనే తరహా పేరుతో ఉన్న ఈ పోస్టర్లో, ఒకవైపు డీహెచ్ఎస్ చిహ్నంతో కూడిన భారీ ట్రాన్స్ఫార్మర్, మరోవైపు తలపాగా ధరించిన ఒక దక్షిణాసియా వ్యక్తి ఉన్నారు. దానిపై “అమెరికా అమెరికన్లకే. మా రోడ్ల మీద నుంచి దిగిపోండి; మిస్టర్ సింగ్, మీకు డ్రైవింగ్ రాదు” “స్వయంగా దేశం విడిచి వెళ్లండి లేదా పరిణామాలు ఎదుర్కోండి” వంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయి. చట్టవిరుద్ధ వలసదారుల గురించి సమాచారం ఇవ్వాలని, స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అందులో సూచించారు.
సిక్కు సమాజం ఆగ్రహం
ఈ పోస్టర్లో ‘సింగ్’ అనే పేరును వాడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిక్కులతో పాటు కొన్ని హిందూ వర్గాల్లోనూ ‘సింగ్’ అనే పేరు సర్వసాధారణం. ముఖ్యంగా, అమెరికాలో ట్రక్కింగ్ పరిశ్రమలో సిక్కులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, వారిని లక్ష్యంగా చేసుకునే ఈ పోస్టర్ను రూపొందించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఫాక్స్ 7 ఆస్టిన్ యాంకర్, సిక్కు-అమెరికన్ అయిన అలెక్ నోలన్ ఈ పోస్టర్ను ‘జాత్యాహంకారపూరితం, అవమానకరం’ అని అభివర్ణించారు. సిక్కు కోయిలిషన్, హిందూ అమెరికన్ ఫౌండేషన్ వంటి సంస్థలు కూడా ఇది జాతి వివక్షను, భారత వ్యతిరేకతను ప్రోత్సహించేలా ఉందని ఖండించాయి.
ప్రస్తుతం ఈ పోస్టర్ ఆన్లైన్లో విపరీతంగా వ్యాపించడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బహిష్కరణ సందేశానికి మద్దతు తెలుపుతుండగా, చాలామంది ఇది జాత్యాహంకార ధోరణి అని ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరపాలంటూ పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.







