అమెరికాలోని చార్లెట్లో ఘనంగా ముగిసిన ‘తెలుగు మాట్లాట 2026’ అంతర్జాతీయ పోటీలు!
2026 ఆగష్టు 16న అమెరికాలోని చార్లెట్ నగరంలో హిల్టన్ ఎయిర్పోర్ట్ రిసార్ట్లో ‘సిలికానాంధ్ర మనబడి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు మాట్లాట 2026’ అంతర్జాతీయ పోటీలు అత్యంత వైభవంగా ముగిశాయి. శ్రీ పారుపూడి కిరణ్, శ్రీ తాళ్ళూరి ప్రత్యూష, శ్రీ గొల్లపూడి సీతారామ్ నాయకత్వంలో జరిగిన ఈ రెండు రోజుల కార్యక్రమంలో అమెరికా, కెనడాల నుంచి 200 పైగా పిల్లలు , 1000 మంది ప్రేక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రాథమిక స్థాయి పోటీల్లో దాదాపు 3,500 మంది పాల్గొనగా, గెలిచిన విద్యార్థులు ఇక్కడి తుదిపోరులో పోటీ పడ్డారు. ఈ పోటీలను పదరంగం, తిరకాటం, ఒనిమా అనే ఆటలను బుడతలు, సిసింద్రీలు, చిరుతలు అనే మూడు వయోవర్గాల్లో నిర్వహించారు.
పోటీల విజేతలు..
పదరంగం: సిసింద్రీల విభాగంలో పెద్దింటి శ్రీ యోగ అద్వైత (LA) ప్రథమ స్థానాన్ని, దొనకంటి శ్రేయాన్స్ (Edison) ద్వితీయ స్థానాన్ని సాధించారు. అలాగే చిరుతల విభాగంలో దువ్వూరి అజిత్ (Edison) ప్రథమ బహుమతిని, మన్నేమేల లక్ష్మీ (Tampa) ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు.
తిరకాటం: బుడతల విభాగంలో అక్షర శ్రీనివాస్ (Cary) ప్రథమ స్థానంలో, సిరిసేని శశాంఖ్ (Baltimore) ద్వితీయ స్థానంలో నిలిచారు. సిసింద్రీల విభాగంలో ఈప్సిత కళ్యాణ్ (Atlanta) ప్రథమ స్థానం, నాలం ధారిష్ (Bay Area) ద్వితీయ స్థానం పొందగా, చిరుతల విభాగంలో గుత్తికొండ వంశీ కృష్ణ (Cary) ప్రథమ స్థానాన్ని, కాట్రగడ్డ ప్రణతి (Detroit) ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు.
ఒనిమా: బుడతల విభాగంలో నాలం దేవర్ష్ (Bay Area) ప్రథమ స్థానంలో, యార్లగడ్డ ఐరా (Ashburn) ద్వితీయ స్థానంలో నిలిచారు. సిసింద్రీల విభాగంలో దొనకంటి శ్రేయాన్స్ (Edison) ప్రథమ స్థానం, దత్ ఈశ్వర్ (Bay Area) ద్వితీయ స్థానం సాధించగా, చిరుతల విభాగంలో వడ్డిచర్ల ఆశ్రిత స్నిగ్థ (Louisville) ప్రథమ స్థానాన్ని, కాట్రగడ్డ ప్రణతి (Detroit) ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
విశేషాలు..
ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ప్రభల శ్రీని గారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మనబడి చేస్తున్న కృషిని, పిల్లల భాషా పటిమను కొనియాడుతూ, విదేశాల్లో తెలుగు రావడం వల్ల ఉద్యోగ, వ్యాపార, కళారంగాల్లో ఎంతో ప్రయోజనం ఉందన్నారు.
శ్రీ శ్రీదేవి గంటి (ఉపాధ్యక్షులు): ఆరియా విశ్వవిద్యాలయంలోని తెలుగు కోర్సులలో చేరాలని పిలుపునిచ్చారు.
శ్రీ రాయవరం విజయ భాస్కర్ (ఉపాధ్యక్షులు): రచనల కోసం బాలచంద్రిక శిక్షణ గురించి వివరిస్తూ, 2026-27 విద్యాసంవత్సరం తరగతులు సెప్టెంబర్ 12/13 నుండి ప్రారంభమవుతాయని తెలిపారు.
శ్రీ కస్తూరి గౌతమ్ చంద్ర (ఉపాధ్యక్షులు): గత 13 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
శ్రీ పారుపూడి కిరణ్ (జట్టు నాయకులు): పోటీల నియమాలను ఈసారి మరింత సులభతరం చేశామని చెప్పారు.
చార్లెట్ ప్రాంతీయ సమన్వయకర్త గొల్లపూడి సీతారామ్ నాయకత్వంలోని బృందం సదుపాయాలు, ఆహారం, పర్యావరణ పరిరక్షణ , సాంకేతిక నిర్వహణలను సమర్థవంతంగా చూసుకుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లెట్’, ఇతర దాతలకు, వాలంటీర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.








