తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ పెరుగుతున్న తరుణంలో, కీలక నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు గ్రూపు రాజకీయాలను రోడ్డుకు ఈడుస్తోంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుండటంతో, అటు కేడర్ తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురవుతోంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బీజేపీలో గత కొంతకాలంగా సాగుతున్న పాత వర్సెస్ కొత్త నేతల వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. తాజాగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తీవ్ర ఆరోపణలతో కూడిన పోస్టర్లు వేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారం వెనుక కేంద్రమంత్రి బండి సంజయ్ వర్గానికి చెందిన కొందరి హస్తం ఉందంటూ ఈటల అనుచరులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ కొంతకాలంగా సాన్నిహిత్యంగా ఉంటుండటాన్ని జీర్ణించుకోలేక, వారి మధ్య గ్యాప్ పెంచేందుకే ఈ పోస్టర్ల కుట్రకు తెరలేపారనే టాక్ వినిపిస్తోంది.
అయితే, దీనికి కౌంటర్గా బండి సంజయ్ అనుచరులు మరో వాదనను తెరపైకి తెస్తున్నారు. గతంలో బండి సంజయ్ కొడుకు భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావడం వెనుక, అలాగే బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దించేయడం వెనుక పరోక్షంగా ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ మరికొందరు నేతల హస్తం ఉందంటూ వారు పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల మధ్య పరస్పర పోస్టులు, తీవ్ర విమర్శలు వైరల్ అవుతున్నాయి.
“ఈటల ఏడుపే బీజేపీకి శాపం.. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్రమంత్రి పదవి రాలేదని నిరంతరం అసంతృప్తితో ఉంటున్నారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినా మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే… మోడీ ఇమేజ్తో కాకుండా తన సొంత ఇమేజ్తోనే గెలిచాననడం రాజకీయ నైతికత కాదు. ఇందూరు బిడ్డ ఎంపీ అర్వింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపుమంట ఎందుకు? నేనే ప్రత్యామ్నాయం అనే భ్రమ నుంచి బయటకు రావాలి.” అని ఈటలపై పోస్టర్లు పెద్దఎత్తున వెలిశాయి.
అయితే, ఈ ఆధిపత్య పోరు వెనుక అసలు కారణం కేంద్ర మంత్రివర్గ విస్తరణే అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది. గతంలో బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న సమయంలో… తమకు కూడా అవకాశం వస్తుందని ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ తదితరులు ఆశించారు. కానీ బండికి మాత్రమే అవకాశం దక్కడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోందని, తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మంత్రి పదవి రేసులో ముందంజలో ఉండాలనే తాపత్రయమే తాజా గ్రూపు రాజకీయాలకు, పరస్పర దుష్ప్రచారాలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన వ్యవహారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటల లాంటి సీనియర్ నేతను కించపరిచేలా నీచ రాజకీయాలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఇది కేవలం ఒక నాయకుడిపై జరిగిన వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, తెలంగాణలో బీజేపీ పుంజుకోవడాన్ని చూసి ఓర్వలేక ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న కుట్రగా వారు అభివర్ణించారు. రాష్ట్ర బీజేపీ నేతలమంతా ఐక్యంగా ఉన్నామని, ఇలాంటి కుట్రలను తిప్పికొడతామని వారు స్పష్టం చేశారు. నేతలు పైకి ఐక్యత రాగం వినిపిస్తున్నప్పటికీ, లోపల జరుగుతున్న అంతర్గత పోరును కేంద్ర అధిష్టానం ఎలా సర్దుమణిగిస్తుందో వేచి చూడాలి.








