తెలంగాణ రాష్ట్రం ఎవరి అబ్బా జాగీరు కాదు : డీకే అరుణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వైఖరిపై ఎంపీ డీకే అరుణ (DK Aruna) తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ (Telangana) రాష్ట్రం ఎవరి అబ్బా జాగీరు కాదని, ఇక్కడ ఎవరైనా తిరగొచ్చని ఆమె స్పష్టం చేశారు. మమ్మల్ని తెలంగాణలో తిరగనివ్వమనడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. రేపటి నుంచి తామే ముఖ్యమంత్రిని రాష్ట్రంలో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. పదవిలోకి వచ్చే ముందు తనకు రాజకీయాలు అవసరం లేదని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు రోజూ రాజకీయాలే పరమావధిగా బతుకుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. గతంలో కేంద్రంతో కోట్లాడిన కేసీఆర్ (KCR), బొక్కబోర్లా పడ్డారని, కేంద్రంతో అనవసరంగా తలపడితే రేపు రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి పద్ధతి దాటి మాట్లాడితే తాము కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ (Modi) తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని, కానీ వాస్తవానికి తెలంగాణలో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు అడిగినా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే నిజాన్ని ఆమె గుర్తు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఒక రూల్, ఢిల్లీలో తమకు ఒక రూల్ నడవదని డీకే అరుణ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధులు లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం నడవడం వెనుక కేంద్రం హస్తం ఉందనేది అక్షర సత్యమని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








