నమో వరల్డ్.. అమెరికన్ల ప్రశంసలు..!
భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రధాని పదవి అధిష్టించడం అంటే మాటలు కాదు. ఓ వేళ అవకాశం వచ్చినా.. దాన్ని నిలబెట్టుకోవడం మరింత కష్టం. కానీ.. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు భారత ప్రధాని మోడీ. సుదీర్ఘకాలం అంటే 12 ఏళ్లపాటు ప్రధానిగా పాలన సాగించడంపై.. ప్రపంచదేశాల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సుదీర్ఘకాలం (12 ఏళ్లు) ఎన్నికైన ప్రధానిగా నిలవడంపై అమెరికా నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా చట్టసభ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులు మోడీ నాయకత్వాన్ని కొనియాడుతున్నారు. ఆయన హయాంలో భారత్ ప్రపంచ వేదికపై ఉన్నత స్థాయికి చేరడమే కాకుండా, అమెరికాతో సంబంధాలు చారిత్రక స్థాయిలో బలపడ్డాయని వారు పేర్కొంటున్నారు.
ఈ మైలురాయిపై అమెరికా సెనేటర్ జాన్ కార్నిన్ స్పందిస్తూ మోడీకి అభినందనలు తెలిపారు. “140 కోట్ల ప్రజల నమ్మకాన్ని మూడుసార్లు గెలుచుకుని, 4,399 రోజులుగా ప్రధానిగా కొనసాగుతున్న మోడీకి అభినందనలు. ఆయన పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. భారత్-అమెరికా భాగస్వామ్యం ఎన్నడూ లేనంత బలంగా ఉంది” అని కార్నిన్ అన్నారు.
ఇండియన్ అమెరికన్ సీఈఓ కౌన్సిల్ సహ వ్యవస్థాపకులు అరుణ్ అగర్వాల్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారత్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. “ఒకప్పుడు ‘భవిష్యత్తు ఉన్న దేశం’గా పేరున్న భారత్, ఇప్పుడు ఆ భవిష్యత్తును అందుకుంటున్న దేశంగా ప్రపంచం దృష్టిలో నిలిచింది” అని ఆయన పేర్కొన్నారు. పలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేశ్ అరోరా కూడా మోడీని అభినందిస్తూ, భారత్-యూఎస్ భాగస్వామ్యం మరింత కొనసాగాలని ఆకాంక్షించారు.
అమెరికన్ గాయని, భారత్ మద్దతుదారు మేరీ మిల్బెన్ ఈ సందర్భాన్ని ‘చారిత్రక ప్రజాస్వామ్య మైలురాయి’గా అభివర్ణించారు. “భారత్ పురోగతి, ఐక్యత కోసం మోడీ నిబద్ధతతో పనిచేశారు. ఆయన నాయకత్వం భావి తరాలకు గొప్ప స్ఫూర్తి” అని ఆమె కొనియాడారు.








