అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు.. బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా క్రిష్ కొర్రపాటి
అమెరికా రాజకీయ రంగాన, అత్యంత ప్రతిష్టాత్మకమైన నాయకత్వ శిక్షణా వేదికపై ఒక తెలుగు కుర్రాడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. అగ్రరాజ్యం వాషింగ్టన్ డి.సి.లో అత్యంత కఠినమైన వడపోతతో నిర్వహించే “అమెరికన్ లెజియన్ బాయ్స్ నేషన్” మాక్ పార్లమెంటరీ ఎన్నికల్లో మన తెలుగు తేజం క్రిష్ కొర్రపాటి ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని ప్రవాస భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వపడేలా చేశాడు.
అమెరికాలోని 49 రాష్ట్రాలు మరియు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేవలం 100 మంది హైస్కూల్ సీనియర్ విద్యార్థులను మాత్రమే ఈ బాయ్స్ నేషన్ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. ముందుగా రాష్ట్ర స్థాయి బాయ్స్ స్టేట్ పోటీల్లో సత్తా చాటిన వారు మాత్రమే ఈ జాతీయ స్థాయికి అర్హత సాధిస్తారు. అలా ఎంపికైన యువత ఒక వారం పాటు అమెరికా సెనెట్ తరహాలో మాక్ సమావేశాలు నిర్వహించి, చట్టాల రూపకల్పన, రాజకీయ చర్చల్లో పాల్గొంటారు.
ఈ మహాసభల్లో విద్యార్థులు నేషనలిస్ట్స్, ఫెడరలిస్ట్స్ అనే రెండు పార్టీలుగా విడిపోయి తమ వాక్చాతుర్యాన్ని, నాయకత్వ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ క్రమంలో తోటి సెనెటర్లందరి మద్దతును కూడగట్టుకుంటూ నార్త్ కరొలినా తరఫున ప్రాతినిధ్యం వహించిన క్రిష్ కొర్రపాటి బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు అర్కాన్సాస్ కు చెందిన సాయర్ రే అధ్యక్షుడిగా ఎన్నికై ఈ నాయకత్వ బృందానికి సారథ్యం వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తెలుగు వారందరికి గర్వకారణం.
అమెరికాలో స్థిరపడిన గుంటూరు జిల్లా పల్లపాడు గ్రామానికి చెందిన తెలుగు కుటుంబం నుంచి వచ్చిన క్రిష్ కొర్రపాటి అద్భుతమైన విజయాన్ని సాధించి యావత్ తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచాడు. డాక్టర్ మధు కొర్రపాటి, శిరీష దంపతుల మనవడైన క్రిష్ కొర్రపాటి, డాక్టర్ వినీత్ కొర్రపాటి, స్మితల కుమారుడు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన “బాయ్స్ నేషన్” ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని తెలుగు వారి కీర్తిని అమెరికాలో రెపరెపలాడించాడు.

ఈ అరుదైన విజయం ద్వారా క్రిష్ కొర్రపాటి క్యాపిటల్ హిల్ లో ఫెడరల్ అధికారులను కలవడంతో పాటు దేశ అత్యున్నత వేదికలపై తన గళాన్ని వినిపించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. క్రిష్ కొర్రపాటి సాధించిన విజయం పట్ల క్రిష్ కుటుంబంతోపాటు.. వారి బంధువర్గం సంతోషంలో మునిగిపోయింది. క్రిష్ తల్లి స్మిత యొక్క తల్లిదండ్రులు గులివెందుల రమణమూర్తి, హేమలత తమ మనవడి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.








