మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. తనకు విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని, వివాదాలు ముఖ్యం కాదన్నారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్కరణల కోసం తాను అంకితభావంతో పనిచేశానని ఆయన పేర్కొన్నారు.
ఏ దేశ అభివృద్ధికైనా దృఢమైన, అందరినీ కలుపుకొనిపోయే మరియు దూరదృష్టితో కూడిన విద్యా వ్యవస్థే పునాది అని చెప్పుకొచ్చారు.
‘‘నా యువ మిత్రులారా, నాలుగు దశాబ్దాలకు పైగా నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్కరణల పట్ల అంకితభావంతో పనిచేశాను. బలమైన, సమ్మిళిత మరియు దూరదృష్టితో కూడిన విద్యా వ్యవస్థే ఒక బలమైన దేశానికి పునాది అని నేను ఎప్పుడూ విశ్వసిస్తూ వచ్చాను.భారత యువత కలలను సాకారం చేయడం ప్రభుత్వ నైతిక బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. “దేశ యువత ఆశయాలు, భావోద్వేగాలు మరియు న్యాయమైన ఆకాంక్షలను నేను ఎంతగానో గౌరవిస్తాను. రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్న మనందరికీ, భారత యువత కలలను వాస్తవ రూపంలోకి తీసుకురావడం ఒక నైతిక బాధ్యత. తనతో పాటు కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు’’ అని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
NEET-UG 2026 ప్రశ్నపత్రం లీక్కు సంబంధించిన అక్రమాలపై స్పందిస్తూ, కేంద్రం ఈ విషయాన్ని “వెంటనే” పరిగణనలోకి తీసుకుందని, దీనిపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించామని ప్రధాన్ తెలిపారు.అయితే, 2026 మే 3న జరిగిన NEET-UG పరీక్షలో అవకతవకలు వెలుగుచూశాయి. భారత ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, దర్యాప్తును CBIకి అప్పగించి, పరీక్షను రద్దు చేయడంతో పాటు పునఃపరీక్ష తేదీని కూడా ప్రకటించిందని రాజీనామా లేఖలో ప్రధాన్ గుర్తు చేశారు.








