కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ బే సిటీ ప్రాజెక్టు : చంద్రబాబు
ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులు
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమీక్షలో అధికారులకు సిఎం చంద్రబాబు దిశానిర్దేశం
విశాఖపట్నం, మే 05: బే సిటిగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సీఎం 9 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖలోని కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ ఈ బేసిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. వీఈఆర్ పై ఓ ప్రాజెక్టు మోనిటరింగ్ యూనిట్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచనలు ఇచ్చారు. గ్రేహౌండ్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించాలని ఆదేశించారు. అలాగే కైలాసగిరి ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకూ ఆహ్లాదం కలిగించేలా బీచ్ వాటర్ స్పోర్ట్స్ తో పాటు వినోదం కలిగించే వివిధ ప్రాజెక్టులు చేపట్టేలా పెట్టుబడులను ఆహ్వానించాలన్నారు.
విశాఖలోని జంతు ప్రదర్శన శాలను కూడా ఆధునీకరించి పర్యాటకుల్ని ఆకర్షించేలా చూడాలని సూచించారు. విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు, బౌద్దక్షేత్రాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు, పోలవరం ప్రాజెక్టు, పాపికొండలు లాంటి పర్యాటక ప్రాంతాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పెద్ద ఎత్తున పర్యాటక ప్రాజెక్టులు వచ్చే అవకాశముందని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల వద్ద పారిశ్రామిక ప్రాంతాలను ఆనుకుని ఏర్పాటు చేసే టౌన్ షిప్ ల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. నీతి ఆయోగ్ సమర్పించిన వీఈఆర్ ప్రాజెక్టు నివేదికను ప్రజల్లో చర్చకు ఉంచాలని , విద్యార్ధులు, మేధావుల నుంచి అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకూ 9 జిల్లాల కలెక్టర్లు, వీఈఆర్ కన్వీనర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టీ కృష్ణబాబు, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సౌరబ్ గౌర్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తదితరులు హాజరయ్యారు.









