బాలెన్ షా ట్యాక్స్.. మండిపోతున్న నేపాలీలు..!
నేపాల్ రాజకీయ నాయకులకు రాజనీతిజ్ఞత ఉండదో.. లేదంటే ప్రజలకు సంబంధించి క్షేత్రస్థాయి అవగాహన ఉండదో తెలియదు కానీ.. పవర్ లోకి రాగానే తమదైన సొంత గుర్తింపు కోసం ప్రయత్నించడం.. ఆపై ప్రజాగ్రహానికి గురికావడం జరుగుతుంది.ఆపై పవర్ కోల్పోయిన సందర్భాలున్నాయి. ఇటీవలే ఓలీ సర్కార్ కుప్పకూలిన ఘటన మరువకముందే మరోసారి ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
కొత్తగా కొలువుదీరిన బాలెన్షా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. భారత్ నుంచి కొనుగోలు చేసే 100 నేపాలీ రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులపై 5% నుంచి 80% వరకు కస్టమ్స్ సుంకాన్ని విధించాలని బాలెన్షా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే దేశవ్యాప్త ఉద్యమానికి దారితీసింది. ఈ నిబంధన వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, వ్యాపారులు ఆర్థికంగా భారీగా నష్టపోతున్నారు, ఇది ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టింది.
భారత–నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు తమ నిత్యవసరాల కోసం, మందులు, ఎలక్ట్రానిక్స్, బట్టల కోసం భారతీయ మార్కెట్లపై ఆధారపడతారు. కొత్తగా విధించిన భారీ పన్నుల వల్ల సామాన్యుడిపై ఆర్థిక భారం పెరిగింది. ఉదాహరణకు, 10 వేల రూపాయల వస్తువు కొంటే అదనంగా పన్నుల రూపంలో భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇది సామాన్య ప్రజలకు తలకు మించిన భారంగా మారింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ దార్జిలింగ్ నుండి ధార్చులా వరకు సరిహద్దు మార్కెట్లలో నిరసనలు మిన్నంటుతున్నాయి.
ప్రజాగ్రహంతో గత ప్రభుత్వం కుప్పకూలి, బాలెన్ షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేపాల్ రాజకీయాలు అస్థిరంగా ఉన్నాయి. అవినీతి రహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చిన బాలెన్ షా ప్రభుత్వం, పాత పాలకులు చేసిన అవే పొరపాట్లు చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. దశాబ్దాల రాజకీయ నేతల అవినీతి ఆస్తులను వెలికితీసేందుకు ప్రభుత్వం విచారణ ప్రారంభించినప్పటికీ, ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తితోనే ఉన్నారు. దీనిని ఎలా అరికట్టాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. కేపీ.హోలీ తీరుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఇప్పుడు బాలెన్ షా పరిస్థితి ఏమిటి అన్నది అర్థం కావడం లేదు.
గతంలో ప్రజలు ఉద్యమించినప్పుడు ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర నేపాల్కు ఉంది. ఇప్పుడు నెలకొన్న ఈ ’వంద రూపాయల’ సంక్షోభం చినికి చినికి గాలివానలా మారుతోంది. పన్ను భారాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజల సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే, అది దేశవ్యాప్త తిరుగుబాటుకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








