తెలంగాణలో ‘ఫోటోల క్రెడిట్’ పంచాయితీ
తెలంగాణ రాజకీయాల్లో ప్రచార ఆధిపత్యం సరికొత్త మలుపు తిరిగింది. సంక్షేమ పథకాల క్రెడిట్ ఎవరిదనే అంశంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య మొదలైన వాగ్వాదం ఇప్పుడు ‘ఫోటోల వార్’గా మారింది. సంక్షేమ పథకాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ముద్రించాలని బీజేపీ పట్టుబడుతుండగా, కేంద్ర పథకాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టకూడదని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది.
తెలంగాణలో కొత్తగా జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను పక్కనపెట్టి సీఎం, మంత్రుల ఫోటోలు ఎలా ముద్రిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.తెలంగాణలో 57 లక్షల రేషన్ కార్డుల ద్వారా దాదాపు 2 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా బియ్యం అందిస్తోందని, అలాంటప్పుడు ఆ పథకానికి సంబంధించిన కార్డులపై మోదీ చిత్రం ఎందుకు ఉండకూడదని నిలదీశారు. గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం రూ.13 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అదనంగా బుల్లెట్ రైన్ కారిడార్ కోసం మరో రూ.1.5 లక్షల కోట్లు వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నిధులిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాటకాలాడుతూ క్రెడిట్ కొట్టేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను విస్మరిస్తూ ’22ఏ నిషేధిత భూముల జాబితా’ పేరిట గత రెండేళ్లుగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.
బండి సంజయ్ వ్యాఖ్యలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా ఆదాయం వెళ్తోందని స్పష్టం చేశారు. జీఎస్టీతో పాటు ఇతర మార్గాల ద్వారా రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్నుల రాబడి అందుతోందని, అందువల్ల రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర పథకాలన్నింటిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులు ఎంత? తిరిగి కేంద్రం నుంచి రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధులు ఎంత? అనే అంశంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో బలంగా ఉందని, తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం ఎవరిదో బండి సంజయ్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీకి నిలబడే సత్తా బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు.
తెలంగాణలో మొదలైన ఈ వివాదం కేవలం ఒక ఫోటోకు సంబంధించినది మాత్రమే కాదు.. సంక్షేమ పథకాల అమలులో ఓటర్లను ఆకట్టుకునేందుకు జరుగుతున్న రాజకీయ పోరాటం. ఉచిత బియ్యం కేటాయింపులు తమవేనని కేంద్రం చెబుతుంటే, రాష్ట్రానికి రావాల్సిన న్యాయబద్ధమైన నిధులను ప్రస్తావిస్తూ ఫెడరల్ హక్కుల కార్డును కాంగ్రెస్ ముందుకు తెస్తోంది. కార్డులపై, పోస్టర్లపై ఫోటోల ప్రాధాన్యత ఎవరు దక్కించుకుంటారనే అంశం రాబోయే రోజుల్లో ఇరు పార్టీల మధ్య మరింత రాజకీయ వేడిని పెంచే అవకాశం ఉంది.








