స్త్రీ శక్తికి సంవత్సరం-రెట్టింపైన ఆత్మగౌరవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి
మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబాల అభ్యున్నతికి మార్గమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళల ఆదాయం పెరగాలని.. ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని.. అప్పుడే కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాల స్థితిగతులను తెలుసుకుని, బాగా వెనుకబడిన కుటుంబాలను ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘స్త్రీ శక్తికి సంవత్సరం-రెట్టింపైన ఆత్మగౌరవం’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం.. తన క్యాంప్ కార్యాలయంలో వారికి తేనేటీ విందు ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ చదువుకుంటే మెరుగైన ఆలోచనలు వస్తాయని.. మంచి ఆలోచనలు వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం అన్నారు. అందుకే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.
ప్రజారోగ్యం మెరుగుపడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని.. ప్రజలు తీసుకోవాల్సిన ఆహారం, ఆరోగ్య అలవాట్లపైనా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సంజీవని వంటి కార్యక్రమాలతో ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నామని చెప్పారు. మహిళలను ఒకప్పుడు చిన్నచూపు చూసేవారని… ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చంద్రబాబు అన్నారు. మహిళలే ఎక్కువగా సంపాదించే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని అన్నారు. దీనికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు ఉద్యమానికి తానే శ్రీకారం చుట్టాననే విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం డ్వాక్రా సంఘాల ద్వారా సుమారు రూ.25 వేల కోట్ల పొదుపు సొమ్ము బ్యాంకుల్లో ఉందని తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మహిళలు క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నారని ప్రశంసించారు. కొన్ని పెద్ద కంపెనీలు కూడా రుణాలు ఎగవేస్తున్న పరిస్థితుల్లో.. డ్వాక్రా మహిళలు మాత్రం తీసుకున్న రుణాలను ఠంచనుగా చెల్లిస్తున్నారని కొనియాడారు. పీ4 విధానం ద్వారా పేద కుటుంబాలకు చేయూతనిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
‘అను నేను’ సంకల్పంతో ముందుకు…
ప్రతి ఒక్కరూ ‘అను నేను’ అనే సంకల్పంతో తమ కుటుంబాన్ని, తమ గ్రామాన్ని, తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్న సంతృప్తితో ఆగిపోకుండా.. వాటిని ఆధారంగా చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాల్లో మరింత ముందుకు రావాలని సీఎం ఆకాంక్షించారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని నియంత్రించామని.. ఇప్పుడు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. గంజాయి నిర్మూలనకు డ్వాక్రా సంఘాలు చొరవ తీసుకోవాలని సూచించారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని మహిళలు ఒక కంట కనిపెడుతూ ఉండాలని అన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని సమాజంలో అశాంతి సృష్టించే వారిని దూరంగా పెట్టే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.









