వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది : అయ్యన్న పాత్రుడు
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో వెలసిన శ్రీ శాంతామణి దేవి పండుగ వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) పాల్గొన్నారు. సకుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న ఆయన, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ (YCP) నేతలు చేస్తున్న విమర్శలపై అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కేవలం అమరావతి (Amaravati)పైనే ఖర్చు చేస్తున్నారని వైసీపీ చేస్తున్న విమర్శలను స్పీకర్ తోసిపుచ్చారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సంపూర్ణ సహకారంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో వైసీపీ నేతల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు.
ఇవి కూడా చదవండి







