డాలస్ లో మునిరత్నంనాయుడును సత్కరించిన ఎన్నారైలు
రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డాలస్ నగరం విచ్చేశారు. ఈ సందర్భంగా తానా పూర్వ అధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందనసభ విజయవంతంగా జరిగింది. ఉపకులపతి డా. నాయుడు మాట్లాడుతూ.. డా. ప్రసాద్ తోటకూర అతి తక్కువ సమయంలో పురప్రముఖులతో ఆత్మీయంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆంధ్రుల అభిమాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు తమ మానసపుత్రికగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజమహేంద్రవరం కేంద్రంగా పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం అదే పేరుతో పున: ప్రారంభమైందని తెలిపారు.
30 సంవత్సరాలకు పైగా విశ్వవిద్యాలయంతో అనుuంధంఉన్న కారణంగా విభజానానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను ఉపకులపతిగా నియమించిందని ప్రస్తావించారు. ప్రభుత్వం, దాతల సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పి-4 పద్ధతిలో పాత భవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలుగు భాష, సాహిత్య, కీర్తి, ప్రతిభా పురస్కారాలు, స్మారకోపన్యాసాలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేయడానికి ఒక ‘శాశ్వత పురస్కార నిధిని’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ తెలుగు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములై సహకారం అందించాలని ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
ఆయన కోరిక మేరకు ‘సాహితీ పురస్కారనిధికి’ పూర్వ పార్లమెంట్ సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి రూ.4 లక్షలు, ‘ప్రతిభా పురస్కారనిధికి’ – ప్రముఖ ప్రవాసాంధ్ర నాయకులు మురళి వెన్నం రూ. 3.50 లక్షలు, ‘కీర్తి పురస్కారనిధికి’ — తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర రూ. 2.50 లక్షలు విరాళాలను ప్రకటించారు. దాతలు ఒకసారి విరాళం ఇస్తే సరిపోతుందని, ఆ మొత్తాలను బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాటిపై వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం వివిధ విభాగాల్లో పురస్కారాలు అందజేస్తామని, ప్రకటించిన వెంటనే పురస్కార నిధికి రూ.10 లక్షలను విరాళాలు అందించిన ముగ్గురికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తానా పూర్వ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలగా అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుపుకుంటున్న సాహిత్యకార్యక్రమాల సంఖ్య 92కు చేరుకుని, ఆరు వసంతాలు పూర్తి చేసుకుందని తెలిపారు. కేవలం సాహిత్య సమావేశాలకే పరిమితం కాకుండా, సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యాన్ని ముద్రించడం, సిరివెన్నెల నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ సహకారంతో అనకాపల్లిలో ఏర్పాటు చేయడం, మనసు ఫౌండేషన్, కొసరాజు కుటుంబసభ్యుల సహకారంతో జానపద కవిబ్రహ్మ కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య సాహిత్యాన్ని ముద్రించి అంగరంగ వైభవంగా ఆవిష్కరించడం తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రయాణంలో కొన్ని మైలురాళ్లు అని తెలిపారు. ఇప్పుడు పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 125 ఏళ్ల తెలుగు కథాప్రస్థానం నుంచి 125 తెలుగు కథలను ఎంపికచేసి వాటిని ఆంగ్లంలోకి అనువదించే ప్రణాళికను చేపట్టామని డా. ప్రసాద్ తోటకూర, ఉపకులపతి ఆచార్య డా. మునిరత్నం నాయుడు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వ పార్లమెంట్ సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి, డా. ప్రసాద్ తోటకూర ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వారందరు తెలుగులో సంతకాలు చేసిన నిలువెత్తు మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గ్రంధాన్ని ఉపకులపతి ఆచార్య డా. డి. మునిరత్నం నాయుడు దంపతులకు బహుకరించి.. ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా. ప్రసాద్ తోటకూర, ఆత్మచరణ్ రెడ్డి, మురళి వెన్నం. తాడిమేటి కల్యాణి, రఘు, ఆనందమూర్తి, లలితామూర్తి కూచిభొట్ల, నాగరాజు, డా. బీరం సుందరరావు, సతీశ్ బండారు, రమణ జువ్వాడి, అనంత్ మల్లవరపు, చినసత్యం వీర్నపు, చంద్ర కన్నెగంటి, చీవీS రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చంద్రహాస్ మద్దుకూరి, దయాకర్ మాడ, లక్షి పాలేటి, సమీర శ్రీపాద, ఆచార్య. పర్వతనేని సుబ్బారావు, పర్వతనేని చాంద్, రాయవరం భాస్కర్, రాజారెడ్డి, నాట్యాచార్యులు కేవీ సత్యనారాయణ, ఎంవీఎల్ ప్రసాద్, సురేశ్ మండువ, రావు కల్వల, రాజశేఖర్ సూరిభొట్ల, శేషారావు బొడ్డు, రాజేశ్ చెరుకుపల్లి, కమలాకర్ దేవరకొండ, తిరుమల రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు.








