Malaysia: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్ , మలేషియా (FNCA-Malaysia) ఆధ్వర్యములో ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం
మలేషియా, కౌలాలంపూర్ – ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్ , మలేషియా ( ఎఫ్ఎన్సిఎ-మలేషియా) ఆధ్వర్యంలో బ్రిక్ ఫీల్డ్స్ లోని కృష్ణ ఆలయంలోని బ్రిందావన్ హాల్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. వందలాది మంది భక్తులు పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు
సీతారాముల కళ్యాణం సందర్భంగా ప్రాంగణం అంతా అద్భుతమైన అలంకరణ తో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. వేద మరియు ఆగమ సంప్రదాయం ప్రకారం అనుభవజ్ఞులైన అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయ వివాహ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం లగ్న సమయంలో సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. ప్రధాన ఘట్టమైన మంగళసూత్ర ధారణ లో పూజారులు శ్రీరాముడు తరఫున సీతాదేవి కి తాళిబొట్టు తో కూడిన మాంగళ్య సూత్రాన్ని అలంకరించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం జరిగింది.
ఇవి కూడా చదవండి

భారతదేశం నుండి మలేషియా కు ప్రత్యేకంగా తీసుకువచ్చిన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహాలకు ముందుగా పల్లకి సేవ నిర్వహించి, నాదస్వర వాద్యాలతో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. భక్తులు, ఇతర సంఘాల నాయకులు హాజరై ఈ సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. రామ నామ సంకీర్తన లు, కోలాటం మరియు పిల్లల ఆట పాటలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సీతారాముల కళ్యాణం అనంతరం స్వామి వారి ప్రసాద వితరణ గా భోజన ఏర్పాట్లు చేశారు
ఈ కార్యక్రమం విజయవంతం అవడంతో నిర్వాహకులు అపార సంతృప్తి వ్యక్తం చేశారు. అధ్యక్షుడు బురెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మహోత్సవం మలేషియా లో ఉంటున్న తెలుగు ఎన్నారైస్ అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చిందని, భవిష్యత్తులో ఇది ప్రతి సంవత్సరం జరిగే సంప్రదాయంగా మారేందుకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన కోర్ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు అలాగే పూజారి రాకేష్ శర్మ కి సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని, ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక, సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, విజయ్ కుమార్ మాడిశెట్టి, మంగపతి, సతీష్ రావు, సందీప్, రవితేజ శ్రీదాస్యాం, సూర్య కుమారి, రజిని పాల్గొని కల్యాణాన్ని ఎంతో వైభవోపేతంగా జరిపారు.
ఇవి కూడా చదవండి








