అట్లాంటాలో కాన్సుల్ జనరల్ శ్రీ రమేష్ బాబు లక్ష్మణన్ కు ఆత్మీయ వీడ్కోలు సభ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో భారత కాన్సుల్ జనరల్ గా పనిచేసిన శ్రీ రమేష్ బాబు లక్ష్మణన్ వీడ్కోలు సమావేశాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కమÖ్యనిటికి, ముఖ్యంగా తెలుగువాళ్ళకు అందించిన విశిష్టసేవలు, నిరంతర సహకారానికి కృతజ్ఞతగా ప్రత్యేక వీడ్కోలు సభను ఘనంగా నిర్వహించారు.
తానా ఈవిపి శ్రీనివాస్ లావు, తానా పూర్వ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తామా అధ్యక్షురాలు సునీత పొట్నూరి, తానా ఫౌండేషన్ ట్రస్టీ, తామా ఛైర్మన్ మధుకర్ యార్లగడ్డ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రమేష్ బాబు మాట్లాడుతూ, తన మూడేళ్ల పదవీకాలాన్ని, అట్లాంటాలోని భారతీయ సముదాయంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ తానా వారసత్వాన్ని, అత్యవసర సమయాల్లో ప్రజలకు అండగా నిలిచే ‘టీమ్ స్క్వేర’ సేవలను ప్రస్తావిస్తూ, అమెరికాలోని భారత కాన్సులేట్లతో టీమ్ స్క్వేర్ వలంటీర్లు ఎప్ప్టటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కాన్సులేట్ అధికారయంత్రాంగం సహకారాన్ని అందించాలని కోరారు. మధుకర్ యార్లగడ్డ మాట్లాడుతూ టీమ్ స్క్వేర్ అవసరాలకు తక్షణమే స్పందించే కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రతినిధి మిని నాయర్కు ధన్యవాదాలు తెలిపారు. సునీత పొట్నూరి మాట్లాడుతూ తామా క్లినిక్ ల్యాబ్ సేవలను ప్రారంభించడంతో పాటు, కాన్సులేట్ రక్తదాన శిబిరాల నిర్వహణలో రమేష్ బాబు చూపిన చొరవను గుర్తుచేసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ లావు, శేఖర్ కొల్లు (తానా ఆరఆర్, తామా సాహిత్య కార్యదర్శి) రమేష్ బాబును ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
స్వల్ప వ్యవధిలోనే ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేసిన తెలుగు సంఘాలకు, ఇతర స్థానిక సంస్థలకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాణి గడ్డం యాంకరింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, ప్రవీణ్ పురం, సెలబ్రేషన్స్ బాంక్వెట్ హాల్ (వేదిక) వ్యవహారాలను, నారాయణ పల్లా డిజెను, రాగ వాహిని బృందం-ప్రియ మాధవ్, సందీప్ కోవెల, శరత్ రమేష్ సంగీత కార్యక్రమాలను, భీమాస్ పాకశాల, రెడ్ చిల్లీస్ వారు భోజనాలు అందించారు. సురేష్ కె. వోలా (ఛాయాగ్రహణం) ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి సహకరించారు.
అట్లాంటా తెలుగుసముదాయం ఐక్యతకు అద్దం పట్టిన ఈ సాయంత్రం ఒక వీడ్కోలు వేడుకగానే కాకుండా, సమష్టి కృషికి నిదర్శనంగా నిలిచింది. శ్రీ రమేష్ బాబు లక్ష్మణ్ దంపతులకు తానా, తామా సంస్థలు భవిష్యత్తు ప్రయాణంలో మరిన్ని విజయాలు అందాలని ఆకాంక్షించాయి.








