ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’
సూర్య – వెంకీ అట్లూరి కలయికలో రూపొందుతోన్న ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ఈ స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో ఒక అద్భుతమైన కుటుంబ వినోదాన్ని అందించడానికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. బ్లాక్బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భావోద్వేగాలు, హాస్యం, హృదయాన్ని తాకే కుటుంబ అనుబంధాలతో ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది.
టీజర్, టైటిల్ ప్రకటన వెలువడినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా చిన్నారితో కలిసి సూర్య కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆయన వింటేజ్ చార్మ్ను గుర్తు చేస్తూ కుటుంబ ప్రేక్షకులను తక్షణమే ఆకట్టుకున్నాయి.
‘సార్/వాథి’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి, మరోసారి బలమైన కుటుంబ విలువలు, హృద్యమైన కథనం కలిగిన ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ను అందించబోతున్నారు.
ఈ చిత్రంలో మమితా బైజు, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బంగ్లాన్ కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు.
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రేక్షకుల మనసులు గెలుచుకొని, ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందిన కుటుంబ వినోద చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
తమిళనాడులో ఈ చిత్రాన్ని థింక్ స్టూడియోస్ విడుదల చేయనుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.







