పాత బైక్స్ కు ఈ-10 పెట్రోల్.. ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు సూచన..!
దేశంలో పెట్రోల్ వినియోగంపై పెద్ద చర్చే జరుగుతోంది. ప్రభుత్వం చమురు ఖర్చులు తగ్గించుకునేందుకు, దేశంలో రైతుల ఆదాయం పెంచేందుకు.. ఈ 20 పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. పెట్రోల్ బంకుల్లో ఈ 20 పెట్రోల్ వినియోగాన్ని తప్పనిసరి చేసింది. దీంతో తమ వాహనాలు పాడైపోతున్నాయని.. బైక్స్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. విపక్షాలు అవే ఆరోపణలు చేస్తున్నాయి. ఆఖరుకు బీజేపీ ప్రభుత్వానికి సానుభూతి పరులుగా ఉన్న వారు సైతం.. ఈ20 పెట్రోల్ వినియోగం పట్ల విముఖత వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ఇలాంటి తరుణంలో.. ఈ20 పెట్రోల్పై కొనసాగుతున్న చర్చలో కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ కీలక సూచన చేశారు. పాత ద్విచక్ర వాహనాలకు ఈ10 పెట్రోల్ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. అలాగే పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని 20 శాతానికి మించి పెంచే ముందు ఆహారం, ఇంధనం మధ్య తలెత్తే ప్రభావాలను పరిశీలించాలని సూచించారు. ఆర్థిక వ్యవహారాల శాఖలో కన్సల్టెంట్గా పనిచేస్తున్న ఆకాశ్ పూజారీతో కలిసి ఆయన ఈ అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో ఈ20 పెట్రోల్ విక్రయిస్తున్నారు. అంటే పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్నారు. అయితే BS-IVకి ముందు తయారైన కార్బ్యురేటర్ ఉన్న ద్విచక్ర వాహనాలకు ఈ20పై కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నాగేశ్వరన్, పూజారీ పేర్కొన్నారు. ఇలాంటి వాహనాలు దేశంలో సుమారు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉన్నాయని అంచనా వేశారు. పాత వాహనాలకు ఇథనాల్కు అనుకూలంగా ఉండే విడిభాగాలు అమర్చవచ్చని, అయితే కోట్లాది వాహనాలను మార్చడానికి సమయం పడుతుందని తెలిపారు.
అందుకే పాత వాహనాలకు ఈ10 పెట్రోల్ను అందుబాటులో ఉంచడం మంచి పరిష్కారమని సూచించారు. దీనివల్ల వాహన యజమానులకు ప్రత్యామ్నాయం లభిస్తుందని చెప్పారు. దేశంలో మొత్తం ఇథనాల్ వినియోగం కూడా కొంత తగ్గుతుందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఈ20 దాటి ఈ27, ఈ30 వంటి అధిక ఇథనాల్ మిశ్రమాల వైపు వెళ్లే ముందు జాగ్రత్త అవసరమని వారు సూచించారు. ఇథనాల్ తయారీకి చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి పంటలను ఉపయోగిస్తున్నారు. ఇంధనం కోసం వీటి డిమాండ్ పెరిగితే ఆహారం, పశువుల దాణా కోసం లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా నీటి వినియోగాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ఈ20 విధానాన్ని మార్చే నిర్ణయం ఏదీ లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే భవిష్యత్తులో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే ముందు భూమి, నీరు, పంటల వినియోగంపై ప్రభావాలను పూర్తిగా అంచనా వేయాలని ఆర్థిక సలహాదారు సూచించడం చర్చనీయాంశంగా మారింది.








