భారత్ కు డాలర్ల వరద.. 80 బిలియన్ డాలర్ల అంచనా..!
ఓవైపు పశ్చిమాసియా రణం… రష్యా-ఉక్రెయిన్ వార్.. మండిపోతున్న చమురు ధరలు.. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వల బలోపేతంగా భారత్ ఫోకస్ పెంచింది. దేశ ఆర్థిక నిల్వలను మరింత పెంచడం లో భాగంగా రిజర్వ్ బ్యాంక్.. ప్రవేశపెట్టిన మూడు ప్రత్యేక ఫారెక్స్ స్వాప్ స్కీమ్ల ద్వారా దేశంలోకి సుమారు 80 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం వస్తుందని భారత్ అంచనా వేస్తోంది. ఈ పథకాలకు అద్భుతమైన స్పందన లభిస్తోందని, ఇప్పటికే 56 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులు సమీకరించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఇది దేశ పటిష్టమైన ఆర్థిక మూలాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది జూన్లో ఆర్బీఐ ఈ రాయితీ డాలర్-రూపీ స్వాప్ పథకాలను ప్రారంభించింది. విదేశీ మారక నిల్వలను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. వీటిలో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) కోసం ఉద్దేశించిన ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్ (ఎఫ్సీఎన్ఆర్-బి) డిపాజిట్ల పథకానికి అనూహ్య స్పందన లభించింది. దీని ద్వారానే సుమారు 52.3 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీంతో ఈ స్కీమ్ను గడువు కంటే నెల ముందే ముగించారు. మిగిలిన రెండు పథకాలు మాత్రం కొనసాగుతున్నాయి.
ఈ నిధుల ప్రవాహం దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవలే ఫారెక్స్ నిల్వలు 707 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికం. ఒక్క వారంలోనే 14 బిలియన్ డాలర్లకు పైగా నిల్వలు పెరగడానికి ఈ స్కీమ్లు కూడా ఒక కారణం. ఈ పథకాల ద్వారా వచ్చిన డాలర్లను ఆర్బీఐ స్వీకరించి, తన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ)లో జమ చేస్తుంది. తద్వారా నిల్వలు క్రమంగా పెరుగుతాయి.
ఈ భారీ ఇన్ఫ్లోల వల్ల 2027 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ చెల్లింపుల బ్యాలెన్స్ (బీవోపీ) లోటు నుంచి మిగులుకు చేరుతుందని, సుమారు 50 బిలియన్ డాలర్ల సర్ ప్లస్ నమోదవుతుందని అంచనా. ఇది రూపాయికి మద్దతు ఇవ్వడమే కాకుండా, ప్రపంచ అనిశ్చితుల మధ్య ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది.








