మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్
రెండో రోజు కూడా 6 గంటలపాటు నిరాటంకంగా…
మంగళగిరి: మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా వరుసగా రెండోరోజు కూడా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) 6 గంటలపాటు నిలబడి పట్టాలు పంపిణీ చేశారు. రెండోరోజున ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటలవరకు 6గంటలపాటు సికె కన్వెన్షన్ వేదికపై నుంచి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. తొలిరోజున 1331మందికి, రెండోరోజున 1303మందికి మొత్తంగా 2,634మందికి నూతన వస్త్రాలు పెట్టి పట్టాలు అందించారు. మలివిడతలో మంత్రి లోకేష్ అందజేసిన పట్టాల మార్కెట్ విలువ సుమారు రూ.1000 కోట్లుగా ఉంది. రెండోరోజు కూడా ఓపికగా నిలబడి పట్టాలు అందించిన లోకేష్… పలువురు దివ్యాంగ లబ్ధిదారులకు వేదిక కిందకు దిగి వెళ్లి పట్టాలను అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి లబ్ధిదారు, వారి కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. తొలివిడత గత ఏడాది ఏప్రిల్ నెలలో 3,003 మందికి పట్టాలు అందజేశారు. 2029లోగా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూముల్లో దీర్ఘకాలంగా నివాసముంటున్న ప్రతి లబ్ధిదారుడికి పట్టాలు అందజేస్తానని గత ఎన్నికల సమయంలో యువనేత లోకేష్ హామీ ఇచ్చారు. ఇరిగేషన్, రెవిన్యూ, అటవీ, దేవాదాయ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, రైల్వే తదితర శాఖలకు చెందిన భూముల్లో పేదలు దాదాపు మూడు దశాబ్దాలకు పైబడి ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. నాడు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వివిధ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ పలుమార్లు సంప్రదింపులు జరిపి, శాఖలవారీగా స్థలాల సమస్యను పరిష్కరించారు. కేంద్రప్రభుత్వంతో ముడిపడివున్న మరికొన్ని భూముల సమస్యను పరిష్కరించాల్సి ఉంది. వాటిపై కూడా కేంద్ర పెద్దలతో మంత్రి లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారు.








