ఛార్లెట్ లో తానా ఆదర్శవంతమైన సేవ… రక్తదానం చేసిన సభ్యులు
ఛార్లెట్ లో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా మరొకరికి ప్రాణదానం ఇచ్చే కార్యక్రమాన్ని చేశారు. అమెరికన్ రెడ్ క్రాస్, ‘సాయి అనుగ్రహ’ సంస్థలతో కలిసి తానా నాయకులు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ, దాతలు ఉత్సాహంగా తరలివచ్చి రక్తదానం చేశారు. నిర్దేశించుకున్న 20 యూనిట్ల లక్ష్యాన్ని మించి, మొత్తం 21 మంది దాతల ద్వారా 21 యూనిట్ల రక్తాన్ని (19 హోల్ బ్లడ్, 2 పవర్ రెడ్) సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రక్తం దాదాపు 63 మంది ప్రాణాలను కాపాడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తానా బోర్డ్ డైరెక్టర్ మల్లి వేమన, పూర్వ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస గోగినేని, సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ సునీల్ దేవరపల్లి, ఛార్లెట్ లోని తానా నాయకులు రవి(నాని) వడ్లమూడి, నాగ పంచుమర్తి , ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, మాధురి ఏలూరితో పాటు ఇతర స్థానిక నాయకులు హాజరై దాతలను, నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా అమెరికన్ రెడ్ క్రాస్, సాయి అనుగ్రహ సంస్థల భాగస్వామ్యానికి, ముఖ్యంగా ఎం.ఆర్.కె. కిషోర్ గారి సహకారానికి తానా బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తీవ్రమైన ఎండను సైతం లెక్కచేయకుండా దాతలకు స్వాగతం పలుకుతూ, రిజిస్ట్రేషన్లు సమన్వయం చేస్తూ నిరంతరం శ్రమించిన వాలంటీర్ల సేవలను నాయకులు కొనియాడారు. రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, కార్యక్రమ విజయానికి కృషి చేసిన అందరికీ తానా నాయకులు ధన్యవాదాలు తెలిపారు.








