యూరప్ దేశాలపై కార్చిచ్చు పంజా..!
యూరోపియన్ దేశాలను కార్చిచ్చు వణికిస్తోంది. ముఖ్యంగా దక్షిణ యూరప్ దేశాలను కకా వికలం చేస్తోంది. ఫ్రాన్స్లో చెలరేగిన మంటలు అదుపులోకి రాకుండా విస్తరిస్తుండగా, గ్రీస్లో విధి నిర్వహణలో ముగ్గురు ఫైర్ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన వేడి, కరవు, బలమైన గాలుల కారణంగా ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్ దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
నైరుతి ఫ్రాన్స్లోని గిరోండే ప్రాంతంలో రాజుకున్న కార్చిచ్చు పారిస్ నగరానికి నాలుగు రెట్ల విస్తీర్ణంలో వ్యాపించిందని అధికారులు తెలిపారు. మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్రాన్స్, స్పెయిన్లలో కలిపి దాదాపు 3.30 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక్క గిరోండే ప్రాంతం నుంచే 2.20 లక్షల మందిని ఖాళీ చేయించారు. 2,200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, 20కి పైగా విమానాలు మంటలను ఆర్పేందుకు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఇతర యూరోపియన్ దేశాల నుంచి కూడా సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. స్థానిక ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
మరోవైపు, గ్రీస్లో పరిస్థితి మరింత విషాదకరంగా మారింది. క్రీట్ ప్రాంతంలోని రెథిమ్నోలో మంటలను ఆర్పే క్రమంలో ఇద్దరు, పెలోపొన్నీస్ ప్రాంతంలో మరొకరు చొప్పున మొత్తం ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. స్పెయిన్లో కొన్ని ప్రాంతాల్లో మంటలు అదుపులోకి రావడంతో ప్రజలు ఇళ్లకు తిరిగి వస్తున్నారు. అయితే, కాస్టెలాన్లో ఇంకా 10,000 మంది తరలింపు శిబిరాల్లోనే ఉన్నారు.
తీవ్రమైన వేడి, తేమలేని వాతావరణం కారణంగా గడ్డి, పొదలు వేగంగా మండిపోతున్నాయని అధికారులు వివరిస్తున్నారు. ఒక బ్రష్-కటింగ్ యంత్రం నుంచి వచ్చిన నిప్పురవ్వల వల్లే ఫ్రాన్స్లో ఈ కార్చిచ్చు మొదలైందని ప్రాథమికంగా భావిస్తున్నారు. యూరప్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండమని, ఇది ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేగంతో ఉందని యూరోపియన్ యూనియన్ క్లైమేట్ సర్వీస్ ‘కోపర్నికస్’ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ యూరప్ దేశాలు అగ్నికీలలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.








