చమురు మంటల్లో అంతర్జాతీయ మార్కెట్లు..!
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమన్నాయి. పశ్చిమాసియాలో శుక్రవారం పెరిగిన ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రమవడంతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 6 శాతం పెరిగింది. ఫలితంగా బ్యారెల్ ధర 109.97 డాలర్లకు చేరి, నాలుగు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. ఈ పరిణామం ద్రవ్యోల్బణం భయాలను మళ్లీ రాజేయడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా, బాండ్ యీల్డ్లు రికార్డు స్థాయికి చేరాయి.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల కీలకమైన హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాపై ప్రభావం పడింది. దీనికి తోడు, యెమెన్లో ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు మోచా నౌకాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడం సరికొత్త ఆందోళనలకు కారణమైంది. దీంతో ఎర్ర సముద్రం మీదుగా జరిగే సౌదీ అరేబియా చమురు ఎగుమతులకు ముప్పు ఏర్పడింది. షిప్పింగ్పై దాడులు పెరుగుతుండటంతో చమురు సరఫరాకు భారీగా అంతరాయం కలగొచ్చన్న భయాలు బలపడ్డాయి.
మార్కెట్లపై తీవ్ర ప్రభావం
చమురు ధరల పెరుగుదల గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. అమెరికా 10-ఏళ్ల ట్రెజరీ యీల్డ్ 5 శాతం మార్కుకు చేరువ కాగా, 30-ఏళ్ల యీల్డ్ 2007 తర్వాత అత్యధిక స్థాయికి ఎగబాకింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చని ట్రేడర్లు భావిస్తున్నారు. ఈ భయాలతో ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. జపాన్ నిక్కీ 2.8 శాతం, దక్షిణ కొరియా కోస్పీ 2.7 శాతం నష్టపోయాయి. ఆస్ట్రేలియా సూచీ కూడా ఒక శాతం పడిపోయింది.
యెమెన్లో పోరు మరింత తీవ్రమైతే ఈ ఏడాది చివరి నాటికి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 122 డాలర్లకు చేరవచ్చని ఆర్బీసీ క్యాపిటల్ మార్కెట్స్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.








