Kavitha:తెలంగాణ ఉద్యమం మాదిరిగా .. మరో బీసీ ఉద్యమం : కవిత

బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. బీసీల బంద్కు మద్దతుగా తెలగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ (Khairatabad) చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పార్టీలే బంద్కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉందని ఎద్దేవా చేశారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లు (BC Bill) ను పాస్ చేయించాల్సిన బీజేపీ (BJP) బంద్కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. హంతకులే వచ్చి నివాళి అర్పించినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. బీసీ బిడ్డలను పదేపదే మోసం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతాం. బంద్ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించడం లేదు. ఈ కారణంగానే సుప్రీంకోర్టు (Supreme Court) లో తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం జనగణన నిర్వహించలేదు. జీవో 9 విషయంలో కూడా ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. అందుకే న్యాయస్థానం జీవోను కొట్టేసింది. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముంది? మహారాష్ట్ర, తమిళనాడులో 5 ఏళ్ల వరకు ఎన్నికలు జరగలేదు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోంది. రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధిగా పనిచేయాలని డిమాండ్ చేశారు.