బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధం.. ఢిల్లీ చేరుకుంటున్న దేశాధినేతలు..!
దేశరాజధాని ఒక్కసారిగా బిజీబిజీగా మారిపోయింది. రాజధాని మొత్తం దుర్భేధ్యంగా తయారైంది. ఎటుచూసినా వెపన్స్ పట్టుకుని, వాహన తనిఖీలు చేస్తున్న బలగాలు కనిపిస్తున్నాయి. ఆపై ఆకాశంలో విమాన శబ్దాలు వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని శాసించే అతిరథమహారథులు.. ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నారు. ఈ హడావుడి అంతా ఢిల్లీ వేదికగా జరిగే బ్రిక్స్ సదస్సు కోసమే. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు ప్రధాని మోడీ.
బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.ఈ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సహా పలువురు ప్రపంచ స్థాయి నేతలు హాజరవుతుండటంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాతో పాటు కొత్తగా చేరిన ఈజిప్ట్, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల అధినేతలు, ప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరితో పాటు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) అధిపతులు కూడా ఈ సమావేశాల్లో పాలుపంచుకోనున్నారు.
అగ్రనేతలకు ఆతిథ్యం ఇస్తున్న హోటళ్లు వారి కోసం ఆహారం, భద్రత, ఇతర సేవల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ చర్చల ద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమష్టి పరిష్కారాలు కనుగొనాలని బ్రిక్స్ కూటమి లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచ సవాళ్లే ప్రధాన అజెండా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం (ముఖ్యంగా హార్ముజ్ జలసంధి దిగ్బంధనం), అమెరికా వాణిజ్య విధానాల వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ సదస్సు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆహార భద్రత, ఇంధన రంగంలో సహకారం, ఆరోగ్యం, విపత్తుల నివారణ, కీలక వస్తువుల సరఫరా వ్యవస్థలలో సమష్టిగా స్థితిస్థాపకతను పెంపొందించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. సంక్లిష్టంగా మారిన ప్రస్తుత ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో బ్రిక్స్ కూటమిని ఒక కీలక శక్తిగా నిలబెట్టాలని భారత్ భావిస్తోంది.
మోడీతో పుతిన్ ద్వైపాక్షిక చర్చలు
ఈ సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు అధినేతల మధ్య ప్రత్యేకంగా ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ భేటీలో రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతం వంటి పలు కీలక అంశాలపై వీరు చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత విస్తరించే మార్గాలపై దృష్టి సారించనున్నారు.








