One/4: “వన్ బై ఫోర్” సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్
తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్గా నటించిన యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం “వన్ బై ఫోర్” (One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. ఇటీవల రిలీజైన “వన్ బై ఫోర్” (One/4) సినిమా మంచి విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో అన్ని సెంటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..
డైరెక్టర్ బాహుబలి పళని మాట్లాడుతూ – మా “వన్ బై ఫోర్” (One/4) సినిమాను ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేశారు. ప్రతి థియేటర్ లో కలెక్షన్స్ బాగున్నాయి. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రానికి కూడా మంచి విజయం అందిస్తామని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు. మా హీరో వెంకటేష్ తన ఫైట్స్, పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతను కన్నడలో యాక్షన్ సినిమా చేశాడు. తెలుగులో వెంకటేష్ కు మంచి అవకాశాలు వస్తాయి. మా ప్రొడ్యూసర్స్ రంజన, రోహిత్ ముంబై నుంచి సినిమా మీద ప్యాషన్ తో టాలీవుడ్ కు వచ్చారు. వారు మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. సినిమా ప్రారంభంలో అవకాశాల కోసం వచ్చే నటీనటులు, సినిమా ప్రమోషన్ లో కనిపించరు. వారు తమ సినిమా అనే కృతజ్ఞతతో ప్రమోషన్ చేయాలి అన్నారు.
ప్రొడ్యూసర్ రంజన రాజేష్ గుంజల్ మాట్లాడుతూ – ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఉన్న మా “వన్ బై ఫోర్” (One/4)సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉండటం వల్లే ఈ విజయం దక్కింది. ఈ చిత్రంలో పవిత్ర అనే క్యారెక్టర్ కు అప్రిషియేషన్ వస్తోంది. హీరో వెంకటేష్ పర్ ఫార్మెన్స్ బాగుందని అంటున్నారు. బ్లాక్ మెయిలింగ్ వల్ల ఓ మహిళ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది మా సినిమాలో చూపించాం. ఈ సినిమా మనల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. మా చిత్రానికి హీరోయిన్స్ నుంచి ప్రమోషన్ కోసం సపోర్ట్ లభించకపోవడం బాధగా ఉంది. హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా సినిమాకు నష్టాన్ని తీసుకొచ్చారు. అన్ని సౌకర్యాలు కల్పించినా వారు సినిమా పట్ల కృతజ్ఢత చూపించలేదు. ఇలాంటి నార్త్ హీరోయిన్స్ కంటే తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా తీసుకుని వారిని ప్రోత్సహించడం మంచిది అని అనిపిస్తోంది అన్నారు.
ప్రొడ్యూసర్ రోహిత్ రాందాస్ గుంజల్ మాట్లాడుతూ – తెలుగు సినిమాలపై అభిమానంతో మేము ముంబై నుంచి టాలీవుడ్ కు వచ్చాం. మా తొలి ప్రయత్నంలోనే మంచి విజయం దక్కింది. మేము ఈ చిత్రం ద్వారా ఇవ్వాలనుకున్న సందేశం ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. కలెక్షన్స్ బాగున్నాయి. ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడూ మోసం చేయరు. కానీ మా చిత్రంలోని నటీనటులే ప్రమోషన్ కు రాకుండా ఇబ్బందిపెట్టారు. లేకుంటే మా సినిమా మరింతగా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లేది అన్నారు.
హీరో వెంకటేష్ పెద్దపాలెం మాట్లాడుతూ – “వన్ బై ఫోర్” (One/4) సినిమా కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. బయట ఇండస్ట్రీలోని ఇతర పెద్ద సినిమాల వల్ల రిలీజ్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ మా ప్రొడ్యూసర్స్ పట్టుదలగా ఈ అడ్డంకులన్నీ దాటుకుని సినిమాను విడుదల చేశారు. అన్ని థియేటర్స్ నుంచి మంచి టాక్ ఉంది. మహిళలు చూడాల్సిన చిత్రమిది. మంచి సినిమా చేశారని అంటున్నారు. ఇంకా ప్రమోషన్స్ చేద్దామంటే మా హీరోయిన్స్ ప్రెస్ మీట్స్ కు రావడం లేదు. ఎంతో ప్యాషన్ తో సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రమోషన్స్ కు రాని నటీనటులు ఆలోచించుకోవాలి అన్నారు.






