US: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా..? గోల్ట్ కార్డ్ ఆఫర్ సిద్ధం..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడి దారులను ఆకర్షించేలా సరికొత్తపథకాన్ని అమలులోకి తెస్తున్నారు. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. దాని స్థానంలో ‘గోల్డ్ కార్డ్’ వీసాలను తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ వీసాలతో పెట్టుబడిదారులు అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం అవుతుందని అధ్యక్షుడు (Donald Trump) పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో 5 మిలియన్ డాలర్లు వెచ్చించగలిగే వారికి ఈ ‘గోల్డ్ కార్డ్ (Gold Card)’లను మంజూరుచేయనున్నట్లు ప్రకటించారు.
‘‘ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో మరింత ధనవంతులవుతారు. విజయాలు సాధిస్తారు. వాళ్లు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు. ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తారు. ఇది చాలా విజయవంతం అవుతుందని మేం భావిస్తున్నాం’’ అని ట్రంప్ వెల్లడించారు. ‘‘మరో రెండు వారాల్లో EB-5 వీసాలను ‘ట్రంప్ గోల్డ్ కార్డ్’లతో భర్తీ చేయనున్నాం. ఇది కూడా ఒకరకంగా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్కార్డ్ లాంటిదే. EB-5 ప్రోగ్రామ్ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నాం. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది’’ అని పేర్కొన్నారు వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్.
ఈబీ-5 వీసా విధానాన్ని 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గణాంకాల ప్రకారం 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని నాలుగేళ్ల క్రితం ఓ అధ్యయనంలో తేలింది.
కాగా.. ఈతరహా ‘గోల్డెన్ వీసా’లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా.. ‘గోల్డ్ కార్డ్’లపై అలాంటిదేమీ ఉండదని అధ్యక్షుడు తెలిపారు. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు తమ ప్రభుత్వం కోటి గోల్డ్ కార్డ్లను ఇవ్వనున్నట్లు వెల్లడించారు.