సెయింట్ లూయిస్లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
సెయింట్ లూయిస్: ఆగస్ట్ 2: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ చాప్టర్ తన సేవా నిబద్ధతను ప్రతి నెల చాటుకుంటూనే ఉంది. సెయింట్స్ లూయిస్ లోని మహాత్మా గాంధీ సెంటర్ వేదికగా ప్రవాస తెలుగు ప్రజల కోసం ఒక ఉచిత మెడికల్ క్యాంప్ను నాట్స్ మిస్సోరీ విభాగం నిర్వహించింది. ప్రతి మాసం ఇలా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం నాట్స్ మిస్సోరీ విభాగం ఒక బాధ్యతగా భావిస్తోంది.
వృత్తిపరమైన బిజీలో ఉన్నప్పటికీ, తోటి వారికి సాయపడాలనే విశాల దృక్పథంతో ఈ వైద్య శిబిరానికి ప్రముఖ వైద్యులు ముందుకు నాట్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులు డా. సుధీర్ అట్లూరి, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు డా. బాపూజీ దార్శిలు స్వయంగా ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఎంతో ఓపికతో రోగులను పరీక్షించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కేవలం వైద్య చికిత్స మాత్రమే కాకుండా, ధైర్యాన్నిస్తూ తగు సలహాలు, సూచనలు అందించారు.
“సేవ” అనేది ఒకరిద్దరితో అయ్యేది కాదు, అది అందరి సమష్టి కృషితో సాధ్యమవుతుందని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది. ఈ బృహత్కార్యం విజయవంతం వెనుక నాట్స్ ఎన్.సి. జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపరతో పాటు నాట్స్ నాయకులు నాగ శ్రీనివాస్ శిష్ట్ల, మిస్సోరీ చాప్టర్ నాయకులు, వాలంటీర్లు తమ విలువైన సేవలను అందించారు. నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన నాట్స్ మిస్సోరీ విభాగాన్ని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో సేవలు అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.








