విశాఖ డేటా సెంటర్లపై అపోహలు వద్దు.. విద్యుత్, నీటి వినియోగం పై లోకేశ్ క్లారిటీ..
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత డేటా సెంటర్ల విషయంలో ప్రజల్లో అనవసరమైన భయాలు, అపోహలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి (Lokam Madhavi) అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన డేటా సెంటర్లకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం (Visakhapatnam)లో చేపట్టనున్న ప్రాజెక్టుల వల్ల విద్యుత్, నీటి వనరులపై అధిక భారం పడుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
విశాఖలో మొత్తం 6.5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఆ లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నామని లోకేశ్ తెలిపారు. గూగుల్ (Google) భారీ డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రకటన చేసిన తర్వాత విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిని దాటి డేటా సెంటర్లను తీసుకురావడం లేదని ఆయన స్పష్టం చేశారు.
డేటా సెంటర్ల వల్ల నీటి కొరత ఏర్పడుతుందనే విమర్శలను కూడా మంత్రి ఖండించారు. 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు సుమారు 3 టీఎంసీల నీరు అవసరమవుతుందని, ఈ అవసరాన్ని పోలవరం (Polavaram) నుంచి అందుబాటులోకి వచ్చే నీటితో తీర్చే ప్రణాళిక ఉందని చెప్పారు. గోదావరి (Godavari) నుంచి సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని పోలవరం ద్వారా వినియోగంలోకి తీసుకువచ్చి విశాఖకు సరఫరా చేయనున్నట్లు వివరించారు. తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించే నీటిలో పరిశ్రమల వాటాను మాత్రమే డేటా సెంటర్లకు వినియోగిస్తామని తెలిపారు.
అంతేకాకుండా ఆధునిక కూలింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో రానున్న రోజుల్లో డేటా సెంటర్ల నీటి వినియోగం మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. విద్యుత్ విషయంలోనూ రాష్ట్రానికి ఇబ్బంది ఉండదని లోకేశ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వన్ నేషన్–వన్ గ్రిడ్ (One Nation–One Grid) విధానం ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోందని వివరించారు.
రాయలసీమ (Rayalaseema) ప్రాంతంలో సౌర, పవన విద్యుత్తో పాటు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా భారీగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో డేటా సెంటర్లకు అవసరమయ్యే విద్యుత్లో సుమారు 70 శాతం గ్రీన్ ఎనర్జీ (Green Energy) నుంచి అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లకు ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు కూడా ఇచ్చినట్లు తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ఆధారిత సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో డేటా సెంటర్ల అవసరం మరింత పెరుగుతుందని మంత్రి అన్నారు. స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే అనేక ఏఐ సేవల వెనుక డేటా సెంటర్ల మౌలిక వసతులు కీలకంగా పనిచేస్తున్నాయని వివరించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రంగం ఉపయోగపడుతుందని తెలిపారు. డేటా సెంటర్లపై జరుగుతున్న ప్రచారాన్ని రాజకీయ కోణంలో కాకుండా వాస్తవాల ఆధారంగా చూడాలని సూచించారు. వీటి ద్వారా ఉద్యోగాలు, పెట్టుబడులు, ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రాష్ట్ర అభివృద్ధికి ప్రయోజనం కలుగుతుందని లోకేశ్ స్పష్టం చేశారు.








