Dhaka: బంగ్లా పౌరులకు బతుకు కష్టాలు.. పాలకులకు లగ్జరీ ఫ్లాట్లు…!
మాట్లాడితే సామాన్యులు.. పేదల ప్రజలకోసం పనిచేస్తామంటారు బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్.. కానీ చేసే పనులు మాత్రం.. మంత్రులకు, పెద్దలకు లగ్జరీ వసతుల కోసం కోట్ల టాకాలు కేటాయిస్తున్నారు. ఈ పరిణామం.. బంగ్లాదేశ్ ప్రజలకు ఆగ్రహం కలిగిస్తోంది. పాలన పక్కన పెట్టి, ఇలాంటి పనులేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దేశం ద్రవ్యోల్బణం, గృహ కొరత, నీటి ఎద్దడి వంటి తీవ్ర సమస్యలతో సతమతమవుతున్న వేళ… మంత్రుల కోసం దాదాపు రూ. 806 కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన ఫ్లాట్లను నిర్మించాలని ఆమోదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఢాకాలోని మింటో రోడ్డులో మూడు కొత్త భవనాల్లో 71 లగ్జరీ ఫ్లాట్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 786 కోట్ల బంగ్లాదేశ్ టాకాలు కాగా, ఫర్నిచర్, ఇతర వస్తువుల కోసం మరో 20 కోట్ల టాకాలు కేటాయించారు. ప్రతి ఫ్లాట్ 8,500 నుంచి 9,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటు రూఫ్టాప్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్లాట్లకు అవసరమైన ఫర్నిచర్ను కూడా ప్రభుత్వ నిధులతోనే సమకూర్చనున్నారు.
ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రముఖ పత్రిక ‘న్యూ ఏజ్’ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. సంస్కరణల గురించి మాట్లాడే మధ్యంతర ప్రభుత్వం, ఉన్నత వర్గాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఇది నిరూపిస్తోందని పేర్కొంది. “ప్రజాధనాన్ని ప్రజల అవసరాలకు కాకుండా, రాజకీయ నాయకుల సౌకర్యాల కోసం ఖర్చు చేయడం నైతిక పతనం” అని వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్ లాంటి పేద దేశంలో లక్షలాది మందికి సరైన ఇళ్లు లేవని, పాఠశాలలు, ఆసుపత్రుల్లో వసతులు కొరవడ్డాయని గుర్తుచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రుల కోసం వందల కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించింది.






