విజయ్ దేవరకొండ నట విశ్వరూపం చూపిస్తూ వచ్చేసిన “రణబాలి” సినిమా టీజర్
అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
విజయ్ దేవరకొండ అభిమానులు, మూవీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న “రణబాలి” సినిమా టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని చూపిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రాక్షస రాజుగా పేరున్న సర్ థియోడర్ హెక్టార్ ఆజ్ఞపై పండిన ప్రతి ధాన్యపుగింజను దోపిడీ చేస్తూ అన్నపూర్ణగా వెలిగిన మన నేలను కరువు సీమగా మార్చేస్తుంటారు బ్రిటీష్ అధికారులు. ఆకలి అని అడిగిన వారిని క్రూరంగా చంపేస్తుంటారు. ఈ రాక్షస రాజు సర్ థియోడర్ హెక్టర్ కు, అతని అధికారులను తన ధైర్య సాహసాలతో అంతే క్రూరంగా ఎదుర్కొంటాడు రణబాలి. గుండె ధైర్యం నిండిన అతని దాటికి, పదునెక్కిన అతని కత్తి వేటుకి బ్రిటీష్ అధికారులు, పోలీసులు చెల్లాచెదురు అవుతారు. ఒక్క ధాన్యపు గింజ పొలిమేర దాటకుండా కాపలా కాస్తూ తన ప్రజల ఆకలి తీర్చుతాడు రణబాలి. అతని పేరేంటని ఆరా తీసిన బ్రిటీష్ అధికారులకు ‘శింగనమల బొబ్బిలి రణబాలిరా..నీ యక్కా’ అంటూ పౌరుషంగా సమాధానం ఇస్తాడు. ఆ కొండపైనున్న మా భద్రమల్లాడి మీద ఆన..నేను కాయలి కాసాండంగా, ఒక్క మెతుకు గూడ పొలిమేర దాడదు చెప్తన్నా..అంటూ రణబాలి పాత్రలో విజయ్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రణబాలి ఒక గుహ ముందు మట్టి కుండలో పెట్టిన ద్రావణాన్ని ఒక చేయి వచ్చి అందుకుంటున్నట్లు టీజర్ చివరి షాట్ లో చూపించడం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
‘రణబాలి’ చిత్రంతో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ప్రేక్షకులకు మరపురాని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నట్లు ఈ టీజర్ తో తెలుస్తోంది. టి సిరీస్, మైత్రీ మూవీ మేకర్స్ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ క్వాలిటీస్ టీజర్ లో ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.








