శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు
అమెరికా అధ్యక్షుడి నివాస భవనమైన శ్వేత సౌధం చరిత్రలోనే భారీస్థాయిలో దీపావళి వేడుకలను నిర్వహించారు. బైడెన్ కార్యవర్గంలోని ఇండో అమెరికన్లు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ మీకు అతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తాను. శ్వేతసౌధంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి దీపావళి ఇదే. మా వద్ద గతంలో కంటే ఇప్పుడు చాలా మంది ఆసియా` అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అమెరికా చరిత్రలోనే తొలి ఆఫ్రికా, దక్షిణాసియా మహిళ కమలా హ్యారిస్ నేతృత్వంలోని నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరవంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్దులకు బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. కమలా హ్యారిస్ మాట్లాడుతూ శ్వేత సౌధం ఒక ప్రజాసౌధం. అధ్యక్షుడు, తొలి మహిళతో కలిసి వారి పండుగలను నిర్వహించుకోవచ్చు. 100 కోట్ల మంది ప్రజలతో కలిసి బైడెన్ కార్యవర్గం కూడా దీపం వెలిగించి చెడుపై మంచి, అజ్ఞానంపై విజ్ఞానం, చీకటిపై వెలుతురు జరిపే పోరాటంలో భాగమైంది అని పేర్కొన్నారు.






