ఇప్పుడు అమెరికా విషయంలో అదే జరిగింది
అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, ప్రభుత్వ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోసీ ఫౌసీ ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై విమర్శలు గుప్పించారు. కరోనా మహమ్మారి నియంత్రణ విషయంలో ట్రంప్ ప్రభుత్వం నిజాయితీగా లేకపోవడమే భారీ సంఖ్యలో అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని ఆయన ఆరోపించారు. దేశంలో కరోనా విజృంభణ తారస్థాయిలో ఉన్న సమయంలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగం చాలా అలసత్వం ప్రదర్శించిందన్నారు. పాజిటివ్ కేసులు, మరణాలు, ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగి సంక్షోభం చుట్టుముట్టినా కూడా ట్రంప్ మతిలేని మాటలు, చేతలతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇవాళ 4 లక్షల మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని ఫౌసీ మండిపడ్డారు. వ్యాధులు ప్రబలినప్పుడు వాటిపై అవగాహన లేకపోతే పరిశోధకుల సూచనలు తీసుకోవాలని, వారు సూచనలను అనుసరించి సంక్షోభం నుంచి బయటపడాలని, అయితే ట్రంప్ మాత్రం కరోనా విషయంలో పరిశోధకులను లెక్క చేయలేదని, పైగా వారిని పిచ్చోళ్లుగా చూశారని ఫౌసీ దుయ్యబట్టారు.
సంక్షోభ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇప్పుడు అమెరికాలో విషయంలో అదే జరిగిందని ఆంధోనీ ఫౌసీ చెప్పారు. అయితే, అమెరికా నూతన అధ్యక్షుడు బైడెన్ మహమ్మారిపై పోరులో పక్కా ప్రణాళికతో ఉన్నారని, ప్రస్తుతం పరిశోధకులు ఆయనతో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర విషయాలను చర్చించే వీలు ఏర్పడిందని ఫౌసీ తెలిపారు. బైడెన్ ముందు చెప్పినట్టుగానే మహమ్మారిపై వార్ ప్రకటించారన్నారు.






