గోపాలపురం పాఠశాల గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు : సీఎం రేవంత్ రెడ్డి
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పాఠశాలను సందర్శించిన కలెక్టర్
* ఉపాధ్యాయినితో మాట్లాడిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్
హైదరాబాద్: గోపాలపురం ప్రాథమిక పాఠశాలలో గదుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గదులు శిథిలమైన తీరుపై ఈనాడు పత్రికలో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే పాఠశాలను సందర్శించి, వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ దివాకరంను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ ఉపాధ్యాయిని ఇందిరతో మాట్లాడారు. పాఠశాలలో పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కలెక్టర్ దివాకర గురువారం పాఠశాలను సందర్శించారు. పాఠశాల అభివృద్ధిపై చొరవ చూపిన ఉపాధ్యాయిని నిమ్మతోట ఇందిరను అభినందించారు. పాఠశాలలో గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు విడుదల చేస్తున్నట్లు ఆమెకు తెలియజేశారు. ఆ వెంటనే నిధులు మంజూరు చేశారు.








