కాంగ్రెస్ పార్టీకి సొంత ఇంట్లోనే శత్రువులు.!
కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడో ఉండరని, ఆ పార్టీలోనే ఉంటారనేది రాజకీయాల్లో తరచూ వినిపించే మాట. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు ఈ వ్యాఖ్యలను అక్షరాలా నిజం చేస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, అంతర్గత అసంతృప్తులు, బహిరంగ విమర్శలు కాంగ్రెస్ సర్కార్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తాజాగా ఫైర్బ్రాండ్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి, సీనియర్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. విపక్షాలకు ఆయుధాలు అందిస్తూ, సొంత ప్రభుత్వంపైనే వీరు గురిపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ హైకమాండ్ ప్రతినిధి మీనాక్షి నటరాజన్తో ఎంపీ రేణుకా చౌదరి భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా తాజా రాజకీయాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే ఈ భేటీ అనంతరం రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులను ఉలిక్కిపడేలా చేశాయి.
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మళ్లీ పుంజుకుంటున్నాయని, కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికైనా మేలుకోవాలని ఆమె ఘాటుగా హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారో ఆ విషయాన్ని బీజేపీ నేతలు పసిగడుతున్నారని, వారిని తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిపై అధిష్ఠానంతో మాట్లాడతానని రేణుక స్పష్టం చేయడం ద్వారా.. పార్టీలో అంతా సజావుగా లేదనే సంకేతాన్ని ఆమె బహిరంగంగానే పంపించారు.

మరోవైపు, సీనియర్ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా షాబాద్ నరమేధం ఉదంతాన్ని ప్రస్తావిస్తూ సొంత ప్రభుత్వంపై, పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు గుప్పించారు. షాబాద్ ఘోర కలికలిలో హంతకుడు ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఈ కేసు ముగిసిందని భావించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కేసులో అసలు లోపాన్ని వేలెత్తి చూపుతూ.. పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రాజ్ కుమార్ బెయిల్పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. నిందితుడి నుంచి లంచం తీసుకుని పోలీసులు అతడి విడుదలకు సహకరించారన్న వార్తలు పత్రికల ద్వారా తెలిసి తెలంగాణ మహిళా లోకం షాక్కు గురవుతోందని విజయశాంతి పేర్కొన్నారు. పోలీసుల చేసిన ఈ ఘోర తప్పిదం వల్లే, బయటకు వచ్చిన నిందితుడు ఏకంగా ఆరుగురి ప్రాణాలను కడతేర్చడానికి ఆస్కారం ఏర్పడిందని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఈ ఘటనను అత్యంత సీరియస్గా పరిగణించాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలోని ఇలాంటి అవినీతి, లోపాల వల్ల తెలంగాణలో మహిళా భద్రతపై అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఒక మహిళా ప్రజాప్రతినిధిగా శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు.
ఈ ఇద్దరు మహిళా నేతల వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలను వీధిలోకి తెచ్చాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను వెతకాల్సిన పనిలేకుండా, సొంత పార్టీ నేతలే లోపాలను ఎండగడుతుండటం కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడుపడటం లేదు. శాంతిభద్రతల వైఫల్యం, నేతల్లో అసంతృప్తి, విపక్షాల బలం పెరుగుతుండటం వంటి అంశాలపై రేణుక, విజయశాంతి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి గొడ్డలిపెట్టులా మారాయి. అధికారంలో ఉండి కూడా సమన్వయం లోపించడం, అంతర్గత అసంతృప్తిని కప్పిపుచ్చుకోలేకపోవడం పార్టీని రక్షణలో పడేస్తోంది. ఈ సొంతింటి మంటలను కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా చల్లారుస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి








