అమెరికా చరిత్రలో తొలి నవకుండాత్మక శత చండీ సహిత శత రుద్ర యాగం – సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో వేడుకలకు సిద్ధం
“లోకాః సమస్తాః సుఖినో భవంతు” అనే విశ్వమంగళ సంకల్పంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తొలిసారిగా నిర్వహించబడుతున్న “నవకుండాత్మక శత చండీ సహిత శత రుద్ర యాగం” ఆధ్యాత్మిక చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలవబోతోంది. మిస్సోరీ రాష్ట్రంలోని బాల్విన్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ ఈ మహాయజ్ఞానికి వేదికగా సిద్ధమవుతోంది.
ఈ యాగం కేవలం ఒక ఆలయ ఉత్సవం మాత్రమే కాదు. వేద సంప్రదాయం, శైవ-శాక్త ఆరాధన, యజ్ఞ సంస్కృతి, విశ్వశాంతి సంకల్పం, భక్తి సమన్వయానికి ప్రతీకగా నిలిచే అపూర్వ ఆధ్యాత్మిక మహోత్సవం.
అర్ధనారీశ్వర తత్త్వానికి సజీవ రూపం..
ఈ మహాయాగం ప్రధాన విశిష్టత శివ-శక్తి సమన్వయం. ఉదయం జరిగే మహాన్యాస పూర్వక శత రుద్ర హోమం పరమశివుని చైతన్య స్వరూపాన్ని ప్రతిబింబిస్తే, సాయంత్రం జరిగే శత చండీ పారాయణం , చండీ హోమం ఆదిపరాశక్తి మహిమను ప్రతిఫలిస్తుంది.
ఈ రెండు యాగాలు కలిసి అర్ధనారీశ్వర తత్త్వాన్ని ప్రతినిధ్యం చేస్తూ, చైతన్యం, శక్తి కలయిక ద్వారా వ్యక్తి, సమాజం , విశ్వానికి సమగ్ర శాంతి, శ్రేయస్సు ప్రసాదించే దివ్య యజ్ఞంగా నిలుస్తాయి.
ప్రతిరోజూ మహాన్యాసం – శత చండీ పారాయణ మహిమాన్వితం..
ఈ మహాయజ్ఞంలో ప్రతి ఉదయం మహాన్యాస పారాయణంతో పాటు రుద్రాభిషేకం, రుద్ర హోమం నిర్వహించబడుతుంది.
ప్రతి సాయంత్రం దేవీ మహాత్మ్యం (దుర్గా సప్తశతి) పారాయణం, చండీ హోమం జరుగుతుంది. మొత్తం ఐదు రోజులలో 100 సార్లు చండీ పారాయణం* జరగడం అత్యంత అరుదైన ఆధ్యాత్మిక విశేషం. ఇది ప్రాంతీయ స్థాయిలో దుష్టశక్తుల నివారణ, దైవిక రక్షణ, లోకక్షేమం కోసం నిర్వహించే మహాసంకల్ప యాగంగా భావించబడుతుంది.
మహాన్యాసం – శివానుగ్రహానికి ద్వారం..
కృష్ణ యజుర్వేదంలోని శ్రీరుద్రాన్ని ఆధారంగా చేసుకుని నిర్వహించే శత రుద్ర యాగంలో మహాన్యాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మహాన్యాసం ద్వారా సాధకులు తమ శరీరాన్నే శివమయంగా భావించి, విశ్వశాంతి, అహంకార నిర్మూలన, అంతరంగ పవిత్రత కోసం రుద్ర మంత్రాలను ఆవాహన చేస్తారు.
శివానుగ్రహం ద్వారా లభించే వైరాగ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మశుద్ధి, చండీ ఉపాసన ద్వారా లభించే ఐశ్వర్యం, ధైర్యం, శక్తి, రక్షణ – ఈ రెండూ కలిసినప్పుడే సంపూర్ణ జీవనసౌఖ్యం సిద్ధిస్తుందని వేదాలు వివరిస్తాయి.
ఇవి కూడా చదవండి
అనేక విశిష్ట హోమాలతో మహాయజ్ఞం..
ఈ మహాయాగంలో శత చండీ, శత రుద్ర యాగాలతో పాటు అనేక అరుదైన హోమాలు నిర్వహించబడుతున్నాయి.
దశసహస్ర మోదక హోమం
ప్రత్యంగిరా హోమం
రాజశ్యామల హోమం
వారాహీ హోమం
నక్షత్ర హోమం
అరుణ హోమం
దుర్గ, సరస్వతి, గాయత్రి, లక్ష్మీ దేవతలకు 10,000 తామర పుష్పాలతో మహా కమలార్చన హోమం
అరుణ హోమం ద్వారా సూర్యనారాయణుని అనుగ్రహం లభించి ఆరోగ్యం, ఆయురారోగ్యం, జీవశక్తి పెరుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి.
10,000 తామర పుష్పాల హోమం దుర్గ, సరస్వతి, గాయత్రి, మహాలక్ష్మి దేవతలకు సమర్పించే అత్యంత అరుదైన మహాహోమం. ఇది జ్ఞానం, ఐశ్వర్యం, రక్షణ, సర్వమంగళాలను ప్రసాదిస్తుందని విశ్వాసం.
అమెరికా నలుమూలల నుండి – భారతదేశం నుండి వేద పండితుల రాక..
ఈ మహాయజ్ఞంలో ముఖ్యంగా శత చండీ పారాయణం నిర్వహించేందుకు అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు భారతదేశం నుండి 30 మందికి పైగా ఋత్వికులు పాల్గొంటున్నారు. వేదాంతం శర్మ గారి ఆధ్వర్యంలో వేదశాస్త్ర నియమాలను అత్యంత కచ్చితత్వంతో పాటిస్తూ ప్రతి క్రతువు నిర్వహించబడుతోంది.

అద్భుత యాగశాల నిర్మాణం..
ఈ యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించబడుతున్న నవకుండాత్మక యాగశాల, తొమ్మిది హోమకుండాలు, విశాల వేదిక, సుందర అలంకరణలు, ఆధునిక ఆడియో-విజువల్ సదుపాయాలు, ప్రకాశవంతమైన లైటింగ్, భక్తుల కోసం ప్రత్యేక కూర్చునే ఏర్పాట్లు, అదనపు పార్కింగ్, అన్నప్రసాదం, తీర్థప్రసాదం, వసతి, రవాణా వంటి ప్రతి అంశం అత్యంత శ్రద్ధతో ప్రణాళికాబద్ధంగా అమలు చేయబడుతోంది.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వివిధ కమిటీల చైర్మన్లు, సభ్యులు, వందలాది మంది స్వచ్ఛంద సేవకులు రాత్రింబవళ్లు సేవలందిస్తున్నారు. “ఏ సేవ చిన్నది కాదు – ప్రతి సేవ యజ్ఞసేవే” అనే భావంతో సేవ చేస్తున్న ప్రతి భక్తునికి ఆలయ యాజమాన్యం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
భక్తుల అపూర్వ సహకారం..
ఈ మహాయజ్ఞం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు విశేషమైన భక్తిశ్రద్ధతో స్పందించారు. ఇప్పటికే 10 లక్షల అమెరికన్ డాలర్లకు పైగా విరాళాలు సమకూరడం భక్తుల విశ్వాసానికి నిదర్శనం.
ఈ మహత్తర కార్యానికి యాగ కమిటీ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో, వైస్ ఛైర్మన్ సాక్షి విజయ్* గారి నాయకత్వంలో, కార్యదర్శి జంగా కిషోర్ గారి సమన్వయంతో, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరియు అనేక మంది సేవాభావం గల భక్తుల సహకారంతో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
షట్ కళ్యాణ మహోత్సవం..
యాగ మహోత్సవాల అనంతరం జరిగే షట్ కళ్యాణ మహోత్సవం ఈ ఉత్సవానికి పరమోత్కృష్ట ముగింపుగా నిలుస్తుంది.
ఈ సందర్భంగా ఒకే వేదికపై నిర్వహించబడే ఆరు దివ్య కళ్యాణాలు:
శివ పార్వతి కళ్యాణం..
వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం
శ్రీనివాస కళ్యాణం
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం
సీతారామ కళ్యాణం
రుక్మిణీ కృష్ణ కళ్యాణం
ఈ దివ్య కళ్యాణాల దర్శనం కుటుంబ శాంతి, ధర్మనిష్ఠ మరియు జీవిత సాఫల్యాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు పేర్కొంటాయి.
చారిత్రాత్మక అవకాశం..
అగ్ని మరియు ఆకాశ తత్త్వాల సమన్వయంతో, తొమ్మిది హోమకుండాలలో నిర్వహించబడుతున్న ఈ నవకుండాత్మక శత చండీ సహిత శత రుద్ర యాగం, అమెరికా నేలపై వేద సంప్రదాయాన్ని మరింత బలపరిచే చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తోంది.
ఈ మహాయజ్ఞంలో భౌతికంగా, మానసికంగా లేదా ఆర్థికంగా పాల్గొనే ప్రతి ఒక్కరూ ఈ దివ్య యజ్ఞ ఫలితంలో భాగస్వాములవుతారు.
వేద వాక్యం చెబుతుంది:
“హోమ ప్రియో మహాదేవః”
యజ్ఞాగ్నిలో సమర్పించే ప్రతి ఆహుతి విశ్వశాంతికి, ప్రకృతి సమతుల్యతకు, సమాజ శ్రేయస్సుకు, వ్యక్తిగత ఆత్మోన్నతికి దోహదం చేస్తుంది.
లోక కళ్యాణమే సంకల్పంగా, వేద ధర్మ పరిరక్షణే లక్ష్యంగా, శివశక్తుల అనుగ్రహమే ఆశయంగా నిర్వహించబడుతున్న ఈ అపూర్వ మహాయజ్ఞంలో ప్రతి భక్తుడు భాగస్వామి కావాలని హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ ఆహ్వానిస్తోంది.








