మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
పాలిటిక్స్, రివ్యూలు, అధికారిక పర్యటనలతో నిరంతరం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సాధారణ తాతగా మారిపోయారు. తన బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకున్న సీఎం, ఇంట్లో తన మనుమడు రేయాన్ష్తో కలిసి సరదాగా గడిపారు. అంతేకాదు కిచెన్లోకి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, తన ప్రియమైన మనవడి కోసం స్వయంగా పూరీలు చేశారు. పిండి కలపడం దగ్గరనుంచి, పూరీలను గుండ్రంగా చేయడం వాటిని నూనెలో వేసి దోరగా వేయించడం వరకు అన్ని పనులనూ ఆయనే స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా వంటగదిలో పూరీలు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.
ముఖ్యమంత్రిగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, కుటుంబానికి, ముఖ్యంగా మనవడికి సమయం కేటాయించి, ఇలా స్వయంగా వంట చేసి పెట్టడం రేవంత్ రెడ్డిలోని సరికొత్త హ్యూమన్ యాంగిల్ బయటకు తెలిసింది. ఓ పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు,బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు రేవంత్. దీనికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








