ఎవడికీ జై కొట్టొద్దు: పవన్ కల్యాణ్ సంచలన ఆడియో మెసేజ్..!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన పుట్టినరోజు వేదికగా రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త కాక రేపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ కేంద్రంలో జనసేన(Janasena Party) పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘జై కొట్టు’ యువజన విభాగం ఆవిష్కరణ సభకు ఆయన పంపిన ఆడియో సందేశం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్న జనసేనాని, అక్కడి నుంచే పంపిన వాయిస్ నోట్తో అటు పొలిటికల్ సర్కిల్స్లో, ఇటు యువతలో ఒకేసారి పూనకాలు తెప్పించారు. తన మార్క్ ఫిలాసఫీ, పదునైన పవర్ఫుల్ డైలాగులతో జనసైనికులకు గూస్బంప్స్ తెప్పించారు పవన్.
ఈ ఆడియో మెసేజ్లో పవన్ కల్యాణ్ వదిలిన పొలిటికల్ పంచ్లు మామూలుగా లేవు. “మనం ఎవరి దగ్గరా, దేనికోసం చేతులు చాచొద్దు.. దేశం కోసం, సమాజం కోసం నిలబడి పనిచేసే చేతులు మనకు కావాలి. నేను ఎక్కడ ఉన్నాననే ప్రశ్నార్థకం మనకు వద్దు.. నేను ఇక్కడే ఉన్నాననే అస్తిత్వ పిడికిలి కావాలి” అంటూ యువత నరాల్లో రక్తం ఉడికేలా మాట్లాడారు. ఇన్నాళ్లూ కేవలం కొందరు నాయకుల కోసం, పాత రాజకీయ పార్టీల కోసం జెండాలు మోస్తూ జిందాబాద్లు కొట్టామని, కానీ ఇకపై ఆ సీన్ మారాలని యువతకు గట్టిగా నూరిపోశారు.
రాబోయే రోజుల్లో యువత తమ సొంత భవిష్యత్తు కోసం, వ్యవస్థలో రాబోయే మార్పు కోసం, మరియు ప్రజాస్వామ్య తీర్పు కోసం ‘జై కొట్టు’ అంటూ పిడికిలి బిగించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. పిఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఈ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కృతమైన ఈ తరుణంలో.. పవన్ స్పీచ్ వెనుక పెద్ద పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉందనే టాక్ వినిపిస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతను పెద్ద ఎత్తున రంగంలోకి దించి, జనసేన క్యాడర్ను మరింత స్ట్రాంగ్ చేయడానికే ఈ ‘యువజన విభాగం’ అస్త్రాన్ని పవన్ బయటకు తీశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, పవన్ కల్యాణ్ బర్త్డే రోజున వచ్చిన ఈ ఆడియో సందేశం ఇప్పుడు కూటమి రాజకీయాల్లో సరికొత్త జోష్ నింపింది.








