ఏపీ మంత్రి సత్యకుమార్కు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు..!
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ నాయకత్వం కీలకమైన బాధ్యతలను అప్పగించింది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘సేవా సంకల్ప్ అభియాన్’ (Seva Sankalp Abhiyan) కార్యక్రమానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్గా ఆయన నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘ ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని ఈ బృహత్తర కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలను సత్యకుమార్కు అప్పగించడం పార్టీలో ఆయన ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవలో (గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా) విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ జన్మదినం కాగా, అక్టోబర్ 7 నాటికి ఆయన ప్రజా క్షేత్రంలో లీడర్గా పాతికేళ్లు పూర్తి చేసుకోనున్నారు.
ఈ ‘సేవా సంకల్ప్ అభియాన్’ ముఖ్య ఉద్దేశం.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వ హయాంలో జరిగిన అద్భుత దేశాభివృద్ధిని, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే. నెల రోజుల పాటు సాగే ఈ అభియాన్లో భాగంగా మొత్తం 13 రకాల ప్రత్యేక సేవా కార్యక్రమాలను రూపొందించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చేలా ‘ఆశీర్వాద్ కా దియా’, ‘నమో సేవ’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా సేవా స్ఫూర్తిని చాటనున్నారు.
దక్షిణాది రాష్ట్రాల బాధ్యుడిగా నియమితులైన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న సన్నాహక వర్క్షాప్లలో చురుగ్గా పాల్గొంటూ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా ‘విక్షిత్ భారత్ 2047’ (Viksit Bharat) లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు మరియు దక్షిణాదిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయి వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.








