మెగా డీఎస్సీ అద్భుతంగా నిర్వహించారు : ఢిల్లీ మంత్రి శిర్సా
16 వేల టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేశారు
టీచర్ రిక్రూట్మెంట్ అంటే ఢిల్లీలో కోర్టులు, కేసుల చిక్కులే
ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణ అద్భుతం అంటూ విద్యా మంత్రి నారా లోకేష్ను ప్రశంసించిన ఢిల్లీ మంత్రి
అమరావతి: ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 16వేల మంది ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టిన తీరుపై ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మన్జిందర్ సింగ్ శిర్సా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్పై ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఆయన ఆర్టీజీఎస్లో విద్యా, ఐటీ, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీఎస్సీ ద్వారా 16వేల మంది ఉపాధ్యాయులను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఎలా నియామకాలు చేపట్టగలిగారని ఆయన మంత్రి నారా లోకేష్ని ఆసక్తిగా అడిగారు. ఢిల్లీలో టీచర్ రిక్రూట్మెంట్ అంటేనే కోర్టులో కేసులు, ఫిర్యాదులు, గందరగోళాలు సృష్టించేసి దాని జోలికెళ్లాలంటే జడిపించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఎలాంటి వివాదాలు లేకుండా పారదర్శకంగా టీచర్ రిక్రూట్మెంట్ పూర్తి చేసిన లోకేష్కు అభినందనలు తెలిపారు. దీనికి మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ తాము డీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించి ఎక్కడా ఎలాంటి చిన్న పొరబాట్లకు తావు లేకుండా 16వేలమందికిపైగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామన్నారు. దీనిపైన కూడా ప్రతిపక్ష పార్టీ చాలా ఆరోపణలు చేసి విఫలమైందన్నారు. కోర్టుల్లో సైతం వారు ఎక్కడా చిన్న అక్రమం జరిగినట్లు ఆధారాలు చూపించలేకపోయారన్నారు. త్వరలో మరో 3వేల మందికిపైగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు. విద్యాశాఖ తనకు ఎంతో ఇష్టమైన శాఖని, విద్యాశాఖలో వినూత్న విధానాలు అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామన్నారు. మొట్టమొదటి సారి ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి ఇదో ఉదాహరణ అన్నారు. ఉపాధ్యాయుల కార్యకలాపాలు, విద్యా శాఖలో మొత్తం కార్యకలాపాలన్నీ పర్యవేక్షించడానికి లీప్ యాప్ రూపొందించామన్నారు.








