భారత రక్షణ రంగ ఎగుమతుల క్రేజీ రికార్డ్..!
భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త మైలురాయిని అధిగమించాయి. గత ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు ఏకంగా రూ. 38,424 కోట్లకు చేరి, మునుపటి ఏడాదితో పోలిస్తే 62.66 శాతం భారీ వృద్ధిని నమోదు చేశాయి. ఒకప్పుడు కేవలం ‘బ్రహ్మోస్'(Brahmos) సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ మాత్రమే భారత ఎగుమతులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేది. కానీ మారుతున్న ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా ప్రస్తుతం భారతదేశం డ్రోన్లు, ఖచ్చితత్వంతో దాడి చేసే గైడెడ్ క్షిపణులు, రాడార్లు మరియు అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ పరికరాలను ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తోంది.
ప్రస్తుతం భారత్ నుండి ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలకు రక్షణ సామగ్రి ఎగుమతి అవుతుండగా, ఎగుమతిదారుల సంఖ్య కూడా 145కు పెరిగింది. ముఖ్యంగా నోయిడాకు చెందిన ఐజీ డిఫెన్స్ (IG Defence) అభివృద్ధి చేసిన ‘కాల్’ (KAL) అనే సుదూర లక్ష్యాలను ఛేదించే అటాక్ డ్రోన్ అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 50 కేజీల బరువును మోసుకెళ్లగల ఈ స్వదేశీ డ్రోన్ టెక్నాలజీ.. ఖరీదైన మిస్సైళ్లతో పనిలేకుండా శత్రు స్థావరాలను అత్యంత తక్కువ ఖర్చుతో అణచివేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
మరోవైపు, ఆయుధాల తయారీతో పాటు వాటి లోపల ఉండే “మేధో పొర” (Intelligence layer) అనగా ఎలక్ట్రానిక్ ఫ్యూజ్ మరియు గైడెన్స్ సిస్టమ్స్ విభాగంలో కూడా భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది. పినాక రాకెట్ లాంచర్లు, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, స్వాతి వెపన్-లొకేటింగ్ రాడార్లతో పాటు అధునాతన యుద్ధ విమానాల విడిభాగాలను కూడా విదేశీయులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఈ వేగవంతమైన పురోగతిని చూస్తుంటే 2029-30 నాటికి రక్షణ ఎగుమతుల్లో రూ. 50,000 కోట్ల లక్ష్యాన్ని భారత్ చాలా సులువుగా చేరుకుంటుందని రక్షణ శాఖా నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








