మంత్రి నారా లోకేష్ ను కలిసిన కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అజయ్ బాబు
దేశానికి గర్వకారణంగా నిలిచారని అభినందించిన మంత్రి
ఉండవల్లి: ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వల్లూరి అజయ్ బాబు.. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లి నివాసంలో కలిశారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరచిన వల్లూరి అజయ్ బాబును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తండ్రి కాంస్య పతకం సాధించగా.. కుమారుడు 16 ఏళ్ల తర్వాత రజత పతకం సాధించి రికార్డ్ సృష్టించారని ప్రశంసించారు. వచ్చే ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా అజయ్ బాబు ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అజయ్ బాబును మంత్రి శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ ఎస్.భరణి పాల్గొన్నారు.








