సముద్ర మట్టాలు పెరిగితే .. ఆ దేశాలు జలసమాధి …గుటెరస్
భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్కు కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి పలు దేశాలను ముంచేస్తాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియ గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న సముద్ర మట్టాలు అంశంపై ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. సముద్ర మట్టాలు పెరిగితే భారత్, బంగ్లాదేశ్, చైనా నెదర్లాండ్స్ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై కోపెన్హాగెన్, లండన్, లాస్ ఏంజెలెస్, న్యూయార్క్, బ్యూనర్ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు. భూతాపం 2 డిగ్రీలు పెరిగితే సముద్రమట్టాలు ఆరు మీటర్లు, 5 డిగ్రీలు పెరిగితే ఏకంగా 22 మీటర్లు పైకెగసి ఆయా దేశాలను జలసమాధి చేస్తాయి అని హెచ్చరించారు.













