Varanasi: ‘వారణాసి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న విడుదల
ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారతీయ చిత్రాలలో ఒకటిగా ‘వారణాసి’ నిలిచింది. మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి తొలిసారిగా చేస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నవంబర్లో జరిగిన గ్లోబ్ ట్రోట్టర్ ఈవెంట్ అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాల్ని తారాస్థాయికి పెంచేసింది. త్రేతాయుగంలో ప్రారంభమై, వారణాసిలో 512 CE గుండా ప్రయాణించి, 2027 CEకి మారి, త్రేతాయుగం (7200 BCE)కి తిరిగి వస్తుందని గ్లింప్స్తో చెప్పకనే చెప్పేశారు. ఈ గ్లింప్స్ ఒక రహస్యమైన మిషన్లో ఉన్న రుద్ర అనే వ్యక్తి శక్తివంతమైన పరిచయంతో ముగిసిందన్న సంగతి తెలిసిందే.
తన అద్భుతమైన, అసాధారణ ప్రచార వ్యూహాలకు పేరుగాంచిన ఎస్.ఎస్. రాజమౌళి ‘వారణాసి’ విడుదల ప్రచారాన్ని అద్భుతమైన రీతిలో ప్రారంభించారు. నిన్న వారణాసి నగరం అంతటా విడుదల తేదీ పోస్టర్ బ్యానర్లు అకస్మాత్తుగా కనిపించడంతో దేశవ్యాప్తంగా అనేక చర్చలు నడిచాయి. ఈ రోజు (జనవరి 30)నిర్మాతలు అధికారికంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ విడుదల తేదీని ధృవీకరించారు. ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు, మొత్తం తారాగణం, సిబ్బంది అద్భుతమైన పోస్టర్తో పాటు ఆన్లైన్లో ఈ రిలీజ్ డేట్ అప్డేట్ను పంచుకున్నారు.
ఈ విజువల్ వండర్ను చూడటానికి అభిమానులు మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వారణాసి ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి రానుంది. మేకర్స్ బిగ్ స్క్రీన్ మీద ఒక భారీ, ఎపిక్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ‘వారణాసి’ని డ్రీమ్ ప్రాజెక్ట్గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అందరినీ గర్వపడేలా చేస్తుందని మహేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. గ్లోబ్ట్రాటర్, టైమ్ట్రాటర్ అనే ట్యాగ్లైన్లతో ‘వారణాసి’ భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది.






