న్యాయవ్యవస్థపై ట్రంప్ ఫైర్..కోర్టు తీర్పుల పట్ల అసహనం..!
కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. నేరుగా ఆ దేశ న్యాయవ్యవస్థ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఆర్థిక విధానాలు, పరిపాలన నిర్ణయాలకు వ్యతిరేకంగా వరుసగా వస్తున్న కోర్టు తీర్పులపట్ల అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కెన్నెడీ సెంటర్కు సంబంధించిన వివాదం.. టారిఫ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులమీద ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మన రాజకీయ వ్యవస్థ ఎంత అవినీతిమయంగా మారిందో.. కోర్టుల వ్యవస్థా అంతే దారుణంగా మోసపూరితంగా తయారైంది’ అని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలకు ఈ విషయాలు స్పష్టంగా తెలుసని, అందుకే తాను భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం తాను చివరివరకు పోరాడతానని స్పష్టం చేశారు. శనివారం తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఈ వివరాలను ట్రంప్ పోస్టు చేశారు.
కెన్నెడీ సెంటర్ వ్యవహారంలో యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి క్రిస్టోఫర్ కూపర్ ఇచ్చిన తీర్పును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో నియమితులైన న్యాయమూర్తి కూపర్.. కెన్నెడీ సెంటర్ పేరుతో చేపట్టాలని భావించిన కొన్ని మార్పులను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే వేసవిలో విస్తృత స్థాయిలో మరమ్మతులు, నిర్మాణ పనుల కోసం సాంస్కృతిక కేంద్రాన్ని మూసివేయాలన్న ప్రతిపాదనను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయాలపై స్పందించిన ట్రంప్.. న్యాయమూర్తి కూపర్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. కూపర్ భార్య అమీ జెఫ్రెస్ రాజకీయంగా వామపక్ష భావజాలానికి అనుకూలంగా ఉన్నారని, ఆమె ప్రభావం న్యాయమూర్తిపై పడుతోందన్నారు.. అమీ జెఫ్రెస్ న్యాయవాదిగా పని చేస్తున్నారని, తనకు వ్యతిరేకంగా గతంలో కేసులు వేసిన వర్గాలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








