Nara Lokesh: సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ సదస్సులో మంత్రి నారా లోకేష్
2030 నాటికి సెమీకండక్టర్స్ రంగంలో ప్రధాన భాగస్వామిగా ఉంటాం
ఏపీని ఎలక్ట్రానిక్స్ & సెమీ కండక్ట్రర్స్ హబ్ గా మార్చడమే మా లక్ష్యం
పారిశ్రామికవేత్తలు తిరిగి ఏపీకి రావాలని ఆహ్వానిస్తున్నాం
మంత్రి లోకేష్ సమక్షంలో 17 ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో రూ.27,909 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు
తద్వారా 53,879 మందికి ఉద్యోగ అవకాశాలు
విశాఖపట్నం: ఎలక్ట్రానిక్స్ & సెమీ కండక్టర్స్ రంగాలను ఈనాడు కేవలం కొత్త తరం టెక్నాలజీని మాత్రమే చూడటంలేదు, భారతదేశం గ్లోబల్ హై-టెక్ తయారీ రంగాన్ని మహాశక్తిగా మార్చాలనే ఆశయాన్నీ ప్రతిబింబిస్తుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అభివృద్ధి, అవకాశం, బలోపేతం (ఎలక్ట్రానిక్స్)పై పెట్టుబడిదారుల దృక్పథం (Investor’s perspective on Growth, Opportunity and Enablement (Electronics)) అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ లోకి ఏపీ కొంచెం ఆలస్యంగా ప్రవేశించింది. 2014-19 మధ్య మనకు మొదటి అవకాశం వచ్చింది. తిరుపతి ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల ఏర్పడిన ఎకో సిస్టమ్ వల్ల ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1,2 వచ్చాయి. ఇది మన మొదటి ప్రయత్నం. గత ఐదేళ్లు బ్రేక్ పడింది. అది పెద్ద అడ్డంకి కాదు.. చిన్న ఆటంకం మాత్రమే. ఇప్పుడు మళ్లీ మేం పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. పెట్టుబడిదారులను రాష్ట్రంలోకి తిరిగి రావాలని, మళ్లీ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నాం.
ఏపీకి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం
మా విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. క్లస్టర్ విధానంలో పారిశ్రామికాభివృద్ధికి కృషిచేస్తున్నాం. వర్టికల్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్.. అంటే ఎకోసిస్టమ్లోని ప్రతి భాగం, ప్రతి కంపోనెంట్ను ఒకే క్లస్టర్ లోకి తీసుకురావడం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు సాగుతున్నాం. దేశంలో తయారయ్యే ఏసీల్లో 60శాతం ఏపీలోనే తయారవుతున్నాయి. భవిష్యత్ విద్య, పరిశోధన, పరిశ్రమ-విద్యారంగ అనుసంధానం మా ప్రాధాన్యత. ఆంధ్రప్రదేశ్ కు అన్ని రంగాల్లో కలిపి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2030 నాటికి సెమీకండక్టర్స్ రంగంలో ప్రధాన భాగస్వామిగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పష్టమైన విధాన దృక్పథం (2024–29), స్నేహపూరిత పాలన, స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో ముందుకు సాగుతూ నవీన ఆవిష్కరణలు, పెట్టుబడులను ఆహ్వానిస్తోందని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
17 ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో రూ.27,909 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు
సదస్సులో 17 ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో రూ.27,909 కోట్ల మేర పెట్టుబడులకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీవోలు, ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. తద్వారా 53,879 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తిరుపతిలో ఎస్ సీఐసీ(SCIC) వెంచర్స్ ఎల్ఎల్ పీ(రూ.1,704 కోట్ల పెట్టుబడి, 2,630 మందికి ఉద్యోగాలు), తిరుపతి-శ్యామా ఎస్ జీఎస్ లిమిటెడ్(రూ.1595 కోట్ల పెట్టుబడి, 1894 మందికి ఉద్యోగాలు), తిరుపతి-ఎపిటోమ్ కాంపోనెంట్స్ లిమిటెడ్(రూ.700 కోట్ల పెట్టుబడి, వెయ్యి మందికి ఉద్యోగాలు), తిరుపతి-హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్(రూ.586 కోట్ల పెట్టుబడి, 613 మందికి ఉద్యోగాలు), తిరుపతి- సోలమ్ ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్(రూ.268 కోట్ల పెట్టుబడి, 700 మందికి ఉద్యోగాలు), తిరుపతి-ఈమక్(Yeemak) ప్రైవేట్ లిమిటెడ్(రూ.11వేల కోట్ల పెట్టుబడి, 20,500 మందికి ఉద్యోగాలు), తిరుపతి-డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(రూ.2,500 కోట్ల పెట్టుబడి, 2,500 మందికి ఉద్యోగాలు), రాష్ట్రవ్యాప్తంగా ఎన్ పీఎస్ పీఎల్(NPSPL) స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్(రూ.2,400 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు), తిరుపతి- ఈ-ప్యాక్(Epack) గ్రూప్(1,416 కోట్ల పెట్టుబడి, 5,322 మందికి ఉద్యోగాలు), తిరుపతి-నియోలింక్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్(రూ.1,150 కోట్ల పెట్టుబడి, 2,100 మందికి ఉద్యోగాలు), తిరుపతి-CIPSA TEC ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(రూ.1,140 కోట్ల పెట్టుబడి, 1,251 మందికి ఉద్యోగాలు), రాష్ట్రవ్యాప్తంగా సంవర్థన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(రూ.1,100 కోట్ల పెట్టుబడి, 2వేల మందికి ఉద్యోగాలు), తిరుపతి-డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్(ఎక్స్ పాన్షన్)(రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి, 10వేల మందికి ఉద్యోగాలు), తిరుపతి-అంబర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్(రూ.400 కోట్ల పెట్టుబడి, 1,500 మందికి ఉద్యోగాలు), తిరుపతి-మీనా సర్క్యూట్స్ ప్రైవేట్ లిమిటెడ్(రూ.350 కోట్ల పెట్టుబడి, 819 మందికి ఉద్యోగాలు), విశాఖపట్నం-రీఫైబ్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్(రూ.350 కోట్ల పెట్టుబడి, 450 మందికి ఉద్యోగాలు), ఎన్టీఆర్ జిల్లా- టైటాన్ ఇంటెక్ లిమిటెడ్ (రూ.250 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు) తో ఎంవోయూ కుదుర్చుకోవడం జరిగింది.
ఈ సదస్సులో ఏపీ ఐటి సెక్రటరీ కాటంనేని భాస్కర్, సైర్మా ఎస్ జిఎస్ ఎండి జస్బీర్ ఎస్ గుజ్రాల్, అసిప్ టెక్నాలజీ ఎండి వెంకటసుధాకర్, డిక్సన్ టెక్నాలజీస్ సిఓఓ పంకజ్ శర్మ, నియోలింక్ సిఇఓ రూవెన్ షైబెల్, పిజి ఎలక్ట్రో ప్లాస్ట్ ఎండి వికాస్ గుప్త, హిండాల్కో ఇండస్ట్రీస్ జాయింట్ ప్రెసిడెంట్ దీపక్ దేశ్ ముఖ్ తదితరులు పాల్గొన్నారు.






