Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ ని విడుదల చేసిన మంత్రి నారా లోకేష్
క్వాంటం టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉంది
క్వాంటం మిషన్, యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించిన రాష్ట్రాలలో ఏపీ ఒకటి
కలలు కనడం మాత్రమే కాదు.. వాటిని సాకారం కూడా చేస్తాం
క్వాంటం కంప్యూటింగ్ పై సదస్సులో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్
విశాఖపట్నం: క్వాంటం టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటింగ్ పై(Atmanirbhar Quantum – Building India’s Indigenous Quantum Stack in Andhra Pradesh) అంశంపై సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రాంగంణలో జరిగిన సదస్సులో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. క్వాంటం కంప్యూటింగ్ అంశంపై కీలక ప్రసంగం ఇవ్వడానికి నేను సరైన వ్యక్తిని కాదనిపిస్తోంది. ఈ రంగంపై నాకు చాలా పరిమితమైన అవగాహన మాత్రమే ఉంది. నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. ఇంత గొప్ప ప్యానల్ సమక్షంలో ఉండటం నాకు గర్వకారణంగా ఉంది. ఏదైనా అమలు చేయాలంటే ముందు ఒక కల ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో మనం కేవలం కలలు మాత్రమే కాదు.. వాటిని సాకారం కూడా చేస్తాం. అందుకే భారతదేశ విజన్ ను సాకారం చేసేలా క్వాంటం మిషన్, యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించిన తొలి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచాం. అమరావతిలో మొత్తం క్యాంటం వ్యాలీకి నాలుగు ముఖ్యమైన పునాదులు రూపొందించడం జరిగింది. మొదటిది అసలైన క్వాంటమ్ కంప్యూటర్ ను ఏర్పాటుచేయడం, దానికి సంబంధించిన వినియోగ సందర్భాలు, పరిశోధనలను అభివృద్ధి చేయడం.. రెండోది దానికి సంబంధించిన సాప్ట్ వేర్ అభివృద్ధి, మూడోది ప్రతిభావంతమైన ఎకోసిస్టమ్ ను నిర్మించడం, నాలుగోది అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్డ్ వేర్ మాన్యుఫ్యాక్చరింగ్. క్వాంటం టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉంది. సీఎం చంద్రబాబు గారు క్వాంటమ్ మిషన్ గురించి, క్వాంటం కంప్యూటర్ తీసుకురావాలని చెప్పినరోజు నేను చాట్ జీపీటీకి వెళ్లి క్వాంటమ్ మిషన్, క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏమిటని వెతికాను. ఇప్పుడు పూర్తిస్థాయి మిషన్ ను నిర్మించే స్థాయికి వచ్చామని చెప్పారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ(2025-30)ని మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. నారా లోకేష్ సమక్షంలో క్వాంటం టెక్నాలజీ రంగంలో 23 సంస్థలతో ఈ సందర్భంగా ఎంవోయూలు కుదుర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్మ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఇండియా స్ట్రాటజిక్ ఇనీషియేటివ్స్ అండ్ అకాడ్ కాయిన్ హెడ్ సీవీ శ్రీధర్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, ప్రైమస్ పార్టనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కో-ఫౌండర్, సీఈవో దేవరూప్ ధర్, డైరెక్టర్ అండ్ సీటీవో అమిత్ సింగీ, క్యూఎన్ యూ ల్యాబ్స్ ఛైర్మన్, కో-ఫౌండర్ శ్రీనివాసరావు ఆలూరి, క్వాంట్రల్ ఓఎక్స్ కో-ఫౌండర్, సీఈవో విశాల్ ఛత్ర, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ పార్టనర్ ఎస్ డీఈ-మేనేజర్ గణేష్ శ్రీనివాసన్, పాస్కల్ సీఈవో రాబర్ట్ మారో తదితరులు పాల్గొన్నారు.






